బాబు కళ్లల్లో ఆనందం కోసం.. రైతులపై కుళ్లు రాతలా?

ఎల్లో మీడియా కథనాలపై  రైతుల తీవ్ర ఆగ్రహం

మామిడి రైతుల కష్టాలను ఏనాడైనా మీ పత్రికల్లో ప్రచురించారా?

బాధ్యతను మరిచి బరితెగించి విషం కక్కుతారా?

హత్యలు చేసే తీవ్ర నేరస్తులతో అన్నదాతలను పోలుస్తారా?

చంద్రబాబు తన అక్కసును పచ్చపత్రికల్లో వార్తల ద్వారా వెళ్లగక్కుతున్నారని మండిపాటు 

వైఎస్‌ జగన్‌ రావడంతోనే మా కష్టాలు సమాజానికి తెలిశాయని వెల్లడి

నాకు 2 ఎకరాల మామిడి తోట ఉంది. వచ్చిన దిగుబడికి, అయిన ఖర్చుకు, ఈ ప్రభుత్వ పాలనలో ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధరకు ఎలాంటి పొంతన లేదు. పూర్తిగా నష్టపోయాం. గిట్టుబాటు ధరలేక కడుపు మండి మా గోడు వైఎస్‌ జగన్‌కు చెప్పుకుందామని వెళితే మమ్మల్ని దండుపాళ్యం బ్యాచ్‌గా, సైకోలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులంటే అంత అలుసా? అధికార పారీ్టపై అంత ప్రేమ ఉంటే చంద్రబాబుకు భజన చేసుకోవాలి. – ఉమాపతి, బట్టికండ్రిగ, వడమాలపేట మండలం, తిరుపతి జిల్లా   

‘‘ఏడాదిగా పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. దిక్కుతోచక రోడ్డెక్కి అనేకమార్లు ఆందోళనలు చేశాం. ఏనాడూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మా సమస్యలను సమాజం దృష్టికి తీసుకువెళ్లలేదు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మా కష్టాలను తెలుసుకునేందుకు వచ్చారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్‌ జగన్‌ పర్యటనకు వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతమైంది. జగన్‌ రాకతోనే మా కష్టాలు సమాజానికి తెలిశాయి.

అందువల్లే  కూటమి పాలకులు జీర్జించుకోలేకపోతున్నారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం పచ్చపత్రికలు బాధ్యతను మరిచి రైతులపై కుళ్లు రాతలు రాశాయి. కల్లాకపటం ఎరుగని రైతులను కరుడుగట్టిన  నేరస్తులైన దండుపాళ్యం బ్యాచ్‌తో పోలుస్తారా? అసలు చంద్రబాబే తన అక్కసును ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తల రూపంలో వెళ్లగక్కుతున్నారు. వెంటనే రైతులపై దుర్మార్గపు రాతలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతాం..’’ అని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు రైతులు 
తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఆ పత్రికలకు పచ్చకామెర్లు కమ్మాయి
రైతు పొలంలో కాలు పెడితేనే ఎంత ధనవంతుడికైనా తిండి నోట్లోకి వెళుతుంది. అలాంటి అన్నదాతలు ఆ పచ్చ పత్రికలకు దం­డు­పాళ్యం బ్యాచ్‌లా కనిపిస్తున్నారా? ఆ పత్రికలకు పచ్చకా­మెర్లు కమ్మాయి. అందుకే ఇంత నీచమైన పదజాలం వాడుతు­న్నాయి.  ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంట వల్ల నష్టాలు వస్తే, కోత కోసే కూలీకి కూడా గిట్టు­బాటు లేక తోట­లోనే పంటను వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఇలాంటి పిచ్చిరాతలు రాసే వారికి ఏం తెలుసు?    – కృష్ణయ్య, చిన్నబ్బనాయుడు కండ్రిగ, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లా

ఇంత నీచంగా వర్ణిస్తారా?
పత్రికలు రైతుల పక్షాన నిలవాలి. లేకుంటే ఊరకుండాలి. ఇలా రైతులను ఆడిపోసుకోవడం మంచి సంప్రదాయం కాదు. రైతు­లను దండుపాళ్యం బ్యాచ్‌ అంటూ ఎల్లో మీడియా అభివ­ర్ణిం­చడం ముమ్మాటికీ సభ్యసమాజం తలదించుకునే చర్యే. రైతులపై ఆ పత్రికలకు అంత కక్ష ఎందుకో? నాకు 30 ఎకరాల పొలం ఉంది. మామిడి తోట సాగు­చేశాను. తీరా పంటచేతికొచ్చి అమ్మకాలకు వెళితే ధర పడిపోయింది. తీవ్రంగా నష్టపో­యాం. వైఎస్‌ జగన్‌కు మా బాధను తెలియజేసేందుకు వెళ్లాం. అంతమాత్రాన రైతుల్ని ఇంత నీచంగా వర్ణిస్తారా?      – రామకృష్ణమ రాజు, నారపరాజు కండ్రిగ, విజయపురం మండలం, చిత్తూరు జిల్లా

ఆ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోండి 
మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మా కష్టాలను గుర్తించి, పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వచ్చారు. రైతు సమస్యలను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేము వెళితే దండుపాళ్యం బ్యాచ్‌గా చిత్రీకరించడం బాధాకరం. ఆ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోండి.     – రంగనాథ్, యువ రైతు, చౌడేపల్లి మండలం, చిత్తూరు జిల్లా

కూటమి నేతలే అసలైన దండుపాళ్యం బ్యాచ్‌
దేశానికి అన్నం పెట్టే రైతులను దండుపాళ్యం బాచ్‌తో పోల్చడం బాధాకరం. మామిడి రైతులను పరామర్శించడానికి వచ్చిన జగనన్నను కలిస్తే తప్పా? ఆయనపై అభిమానంతో స్వచ్ఛందంగా వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నింది కూటమి ప్రభుత్వమే. వైఎస్‌ జగన్‌ రాకతోనే మామిడి రైతుల కష్టాలు సమాజానికి తెలిశాయి. అసలైన దండుపాళ్యం బాచ్‌ కూటమి నేతలే.    – మనోహర్‌రెడ్డి, పెరుమాళ్లపల్లి, యాదమరి, చిత్తూరు జిల్లా

ఈనాడులో పిచ్చివ్యాఖ్యలు దారుణం 
ఈనాడు సహా ఎల్లో పత్రికల్లో పిచ్చి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మామిడి రైతులను ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధరలు లేకుండా నట్టేట్లో ముంచటంతోపాటు వారిని దండుపాళ్యం బ్యాచ్‌ అనటం పద్ధతికాదు. మామిడి రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించి వారికి భరోసా కల్పించడానికి వైఎస్‌ జగన్‌ వస్తే నిస్సిగ్గుగా తప్పుడు వార్తలు రాయటం దుర్మార్గం. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను దారి పొడవునా పెట్టి స్వచ్ఛందంగా వస్తున్న రైతులపై విచక్షణ రహితంగా లాఠీచార్జ్‌ చేయించింది.. దీన్ని ఏమంటారు? చంద్రబాబు రైతులకు ఎప్పుడూ మేలు చేయరు. మేలు చేసే వారిని చూసి ఓర్వలేడు. చంద్రబాబు తన అక్కసును పచ్చ పత్రికల ద్వారా తీర్చుకుంటున్నారు.    

  – లోకనాథరెడ్డి, ఐరాల, చిత్తూరు జిల్లా

రైతులకు క్షమాపణ చెప్పాలి
మామిడి రైతులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనకు వెళ్లిన రైతులను దండుపాళ్యం బ్యాచ్‌ అంటూ దుష్ప్రచారం చేసిన పచ్చ పత్రిక యాజమాన్యం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వ అనుకూల దినపత్రిక రైతులపై విషం చిమ్మడం తగదు.     

– నారాయణప్ప, పుంగనూరు, చిత్తూరు జిల్లా

రైతులను నేరస్తులతో పోలుస్తారా?
నాకు పది ఎకరాల మామిడి తోట ఉంది. దానిలో నాలుగు ట్రక్కులు మామిడి కాయలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి­వరకు టోకెన్లు లేక తరలించలేకపోయాను. మేం పడుతున్న కష్టాలను మా నాయకుడు వైఎస్‌ జగన్‌కు చెప్పుకొనేందుకు ఎంతో ఆశతో వెళితే మాకు పోలీసులు నిరాశ మిగిల్చారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కరుడుగట్టిన నేరస్తులతో పోల్చడం దుర్మార్గం. అసలు రైతు లేకపోతే మీరు ఏం తింటారు?   

  – యుగంధర్‌ నాయుడు, దిగువ కండ్రిగ, చిత్తూరు జిల్లా.

ఎన్నడూ ఇలాంటి రాతలు చూడలేదు
నా సొంత తోటతోపాటు కొన్ని మామిడి తోటలు కౌలుకు తీసుకున్నా. సుమారు 50 ట్రక్కుల వరకు మామిడి ఉంది. ఇప్పటివరకు 30 ట్రక్కుల వరకే ఫ్యాక్టరీకి తరలించాను. ప్రస్తుతం ఉన్న కాయలను ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం మద్దతు ధర కూడా లేదు. మా బాధలను వైఎస్‌ జగన్‌కు చెప్పుకొనేందుకు వస్తే కూటమి ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంది. కూటమి ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోవడం లేదు. ఎన్నడూ మామిడి రైతులు ఇలాంటి కష్టాలు పడలేదు. ఎప్పుడూ పత్రికలు ఇలా రైతులను చులకన చేసి నీచంగా వార్తలు రాయడం చూడలేదు.    – ధనుంజయరెడ్డి, కలికిరిండ్లు, చిత్తూరు జిల్లా

రైతులను అవమానించడం సిగ్గుచేటు
ఆంధ్ర అంటే అన్నపూర్ణ అని దేశవ్యాప్తంగా అంటారు. దీనికి కారణం అన్నదాతలు కష్టపడి పంటసాగు చేయడమే. అటువంటి రైతులను కూటమి నాయకులు, పచ్చ మీడియా కలిసి దండుపాళ్యం బ్యాచ్‌ అని అవ­మానపర­చడం సిగ్గుచేటు. దండుపాళ్యం బ్యాచ్‌ అనేవారు ఒక్కరోజు పొలంలో పని చేస్తే అప్పుడు తెలుస్తుంది అన్నదాత కష్టం, ఆవేదన.     – మునికృష్ణయ్య రైతు, మెట్టు, చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లా

రైతుల ఉసురు తగులుతుంది
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆక్రందనతో రోడ్డెక్కితే పచ్చ పత్రికల్లో రైతులను దండుపాళ్యం బ్యాచ్‌ అంటూ అవమానించడం అత్యంత దుర్మార్గం. రైతుల ఉసురు తగిలి ఈ ప్రభుత్వం, ఆ పత్రిక బంగాళాఖాతంలో కలవడం ఖాయం.    – శంకర్‌రెడ్డి, గురవరాజుపల్లి, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లా

ఓర్వలేకే ఈనాడు ఉన్మాదపు రాతలు... 
రాష్ట్రంలో రైతులు అన్ని విధాలా నిరాద­రణకు గురై అల్లాడిపోతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళెం పర్య­టన విజయవంతం కావటంతో ఓర్వలేని కూటమి పాలకులు ఈనాడు, తోకపత్రిక చేత రైతులను దండుపాళ్యం బ్యాచ్‌గా అభి­వర్ణిస్తూ ఉన్మాదపు రాతలు రాయించారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి, ఆ పత్రికకు రైతులు తగిన బుద్ధి చెబుతారు. – హేమలత, చెంగారెడ్డి పట్టెడ, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లా

Back to Top