శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో అనుమానం

 తిరుమల : శ్రీవారి ఆభరణాల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెప్పిన జేఈఓ శ్రీనివాస రాజు ఇప్పటివరకు వాటిని పెట్టలేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్ర‌శ్నించారు.  తిరుమల శ్రీవారి ఆభరణాలు మాయం అయ్యాయని భక్తుల్లో అనుమానాలు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని నగరి  ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో ఆమెమాట్లాడారు. నిత్యం స్వామివారికి సేవ చేసే రమణదీక్షితులను అవమానపరిచి తొలగించారని టీడీపీపై మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశత్వానికి ఇది నిదర్శనమన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించకపోతే నిరసన తెలియజేశామని.. దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. శ్రీ‌వారి ఆభ‌ర‌ణాలు గతంలో ఆన్‌లైన్‌లో ఉంచుతామ‌న్నార‌ని, అయితే అవి ఏమ‌య్యాయోన‌ని భ‌క్తులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నార‌ని, వాటిని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విజయనగరంలో గిరిజన గర్భిణీ మహిళ 12 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి బిడ్డను పోగొట్టుకుంది.. కనీస వైద్య సదుపాయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు అంటే చంద్రబాబుకు పట్టదు.. అందుకే గిరిజన మంత్రిని కూడా నియమించలేదని వెల్లడించారు.

Back to Top