పొందుగల వద్ద షర్మిలకు అఖండ స్వాగతం

పొందుగల (గుంటూరు జిల్లా), 23 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం సాయంత్రం గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. శ్రీమతి షర్మిలకు గుంటూరు జిల్లా వాసులు ప్రత్యేకించి పల్నాడు ప్రాంత ప్రజలు, వైయస్‌ అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. శనివారం సాయంత్రం వరకూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం వాడపల్లిలో పాదయాత్ర చేసిన శ్రీమతి షర్మిల వాడపల్లి వంతెన మీదుగా పొందుగల గ్రామం ద్వారా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించారు. శ్రీమతి షర్మిల అడుగులో అడుగు వేసి పాదయాత్రలో తామూ భాగస్వాములయ్యేందుకు మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

గుంటూరు జిల్లాలో శ్రీమతి షర్మిల 14 నియోజవర్గాల పరిధిలో మొత్తం 300 కిలోమీటర్ల మేరకు నడుస్తారు. శ్రీమతి షర్మిల 20 రోజులకు పైగా గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తారు. ఇంతవరకూ శ్రీమతి షర్మిల నిర్వహించిన పాదయాత్రలో గుంటూరు జిల్లాలోనే అత్యధిక నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. కాగా, నల్గొండ జిల్లాలో శ్రీమతి షర్మిల మొత్తం 151.3 కిలోమీటర్లు నడిచారు.
Back to Top