మల్దకల్, (మహబూబ్ నగర్ జిల్లా): దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లీంలకు ఆదరణ లభించిందని ఆయన తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. వైయస్ఆర్ పాలనలో మైనార్టీలకు భద్రత ఉండేదన్నారు. కానీ పాలకుల నిర్లక్ష్య ధోరణుల వల్ల ప్రస్తుతం ముస్లీంలు అభద్రతా భావంలో కాలం గడుపుతున్నారని షర్మిల అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో తన ఐదో రోజు పాదయాత్రలో భాగంగా సోమవారం మల్దకల్ గ్రామంలో షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రచ్చబండ కార్యక్రమంలో ముస్లీంలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.