<strong>కాకినాడ (తూర్పు గోదావరి జిల్లా) :</strong> ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తూర్పుగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిబద్ధతతో పనిచేస్తున్న తమ పార్టీ ప్రజలకు ఎంతగానో చేరువైందని చిట్టబ్బాయి అన్నారు. కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా సంబంధ అంశాలపై పార్టీ నిరంతరం ప్రతిస్పందిస్తూనే ఉందన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించి, పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ స్ఫూర్తితో ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు.<br/>అన్నదాతల సమస్యలు, ఫీజు రీయింబర్సుమెంట్, విద్యుత్, గ్యాస్ చార్జీలు సహా అనేక అంశాలపై పెద్ద ఎత్తున పోరాటం చేసి, ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పార్టీలో కష్టపడి, అంకితభావంతో పనిచేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.<br/>సహకార ఎన్నికల్లో వైయస్ఆర్సిపికి మంచి విజయవకాశాలు ఉన్నాయని చిట్టబ్బాయి ధీమా వ్యక్తం చేశారు. రైతాంగం కోసం మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఎన్నో పథకాలు అమలు చేశారని, ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ను గెలిపించాలన్న తపన అన్ని ప్రాంతాల్లో కనిపిస్తోందన్నారు.<br/>శ్రీ జగన్కు మద్దతుగా చేపట్టిన సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభిస్తోందని పార్టీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ కర్రి పాపారాయుడు అన్నారు. పార్టీ కో-ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, నాయకులు సిరిపురపు శ్రీనివాసరావు, అమలాపురం పట్టణ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.