తాగు, సాగు నీటికోసం ఆమరణ దీక్ష: రవీంద్రనాథ్‌రెడ్డి

వైఎస్‌ఆర్ కడప జిల్లా: తాగు, సాగు నీటి సమస్యను తీర్చాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష  చేపట్టనున్నట్లు కడప జిల్లా కమలాపురం నియోజక వర్గ శాసన సభ్యుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డితెలిపారు.  ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజక వర్గ ప్రజలు తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రజలతో కలసి వీరపునాయునిపల్లె మండల కేంద్రంలో ఈనెల 25నుంచి ఆమరణ  నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు. మార్చి 7 నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతాయని, ఈ బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గ నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రభుత్వానికి ఉద్యమాలు, నిరసనలపై నమ్మకం ఉంటే గాలేరు-నగరి సుజల స్రవంతికి నిధులను మంజూరు చేస్తుందనే ఆలోచనతో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జీఎన్‌ఎస్‌ఎస్ పూర్తి కావడానికి 2700 కోట్లు వ్యయం అవుతుందని, అందులో భాగంగా కడప జిల్లాకు1400 కోట్లు, మిగిలిన జిల్లాలకు తాగు, సాగు నీటి అవసరాల కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే ప్రాజెక్టు పూర్తి అవుతందని చెప్పారు. పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, రాజుపాలెం సుబ్బారెడ్డి, నాయకులు  నారాయణ రెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి,  పుల్లారెడ్డి, సుధా కొండారెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, క్రిష్ణారెడ్డి, చిన్ని పాల్గొన్నారు.
Back to Top