<strong>* ప్రాజెక్టులకు జలకళ వచ్చింది</strong><strong>* పెండింగ్ పనులు పూర్తి చేసే వరకు పోరాటం</strong><strong>* హంద్రీ–నీవా కాలువ నుంచి అన్ని ప్రాజెక్టులకు నీరందించడమే నా చిరకాల వాంఛ</strong><strong>* అన్నదాతల సంతోషమే నా ధ్యేయం</strong><strong>* ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి</strong><br/>రాయచోటి రూరల్ (కడప) : వైయస్ఆర్ కన్న కలలు నేటికి నెరవేరాయని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిన్నమండెం మండల పరిధిలోని శ్రీనివాసపురం రిజర్వాయర్ను స్థానిక నాయకులు దేవనాథరెడ్డి, కంచంరెడ్డి, వెంకట్రమణలతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అనంతరం విలేకర్లతో మాట్లాడారు. హంద్రీ–నీవా కాలువ నుంచి నీరు వచ్చి చేరాల్సిన శ్రీనివాసపురం రిజర్వాయర్ , వర్షపు నీటితోనే జలకళను సంతరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రాజెక్టుకు గేట్లు ఏర్పాటు చేయలేదని, దీంతో ప్రాజెక్టులోని నీరంతా వృథాగా పారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీ–నీవా కాలువతో పాటు, శ్రీనివాసపురం రిజర్వాయర్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ ముంపు వాసులకు వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, నూతనంగా కాలనీ కట్టుకుంటున్న వారికి ఇంటి బిల్లులు చెల్లించాలని అధికారులతో ఫోన్లో మాట్లాడారు. 2016 నాటికే హంద్రీ–నీవా కాలువను పూర్తి చేసి రాయచోటి నియోజకవర్గంలోని ప్రాజెక్టులకు కృష్టా ప్రాజెక్టు నుంచి నీరందిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం చంద్రబాబు మాట తప్పారని ఆయన విమర్శించారు. 2018 మార్చి నెలాఖరుకైనా హంద్రీ–నీవా నీరు వెలిగల్లు, శ్రీనివాసపురం రిజ్వరాయర్లకు ఇప్పించే విధంగా చేయడమే తన చిరకాల వాంఛగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఝరికోన ప్రాజెక్టు నిండి జలకళ సంతరించుకుందని, వెలిగల్లు ప్రాజెక్టులో 2 టీఎంసీలు నీరుందని, పై నుంచి వస్తున్న ప్రవాహం ద్వారా రోజూ 1200 క్యూసెక్కుల నీరు వస్తోందని, అలా 20రోజుల పాటు నీరు వచ్చి వెలిగల్లు ప్రాజెక్టులో కలిస్తే , ప్రాజెక్టు నిండుకుండలా ఉంటుందని ఆయన చెప్పారు. ఇంతటి మహత్తర కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయించి, అడిగిన వెంటనే రైతుల కోసం ప్రాజెక్టులను మంజూరు చేయించి పనులు పూర్తి చేసిన దివంగత నేతను రైతులెవ్వరూ జీవితాంతం మరిచిపోరని సంతోషం వ్యక్తం చేశారు........................................<strong>రైతులతో ఆడుకుంటే పుట్టగతులుండవ్</strong><strong>* రైతు రథం పేరుతో ట్రాక్టర్ల పంపిణీలో రాజకీయం</strong><strong>* ట్రాక్టర్ల కోసం ధరఖాస్తు చేసుకున్న రైతులందరికీ సబ్సిడీలో ట్రాక్టర్లు ఇప్పించే బాధ్యత నాది</strong><strong>* ఎమ్మెల్మే గడికోట శ్రీకాంత్ రెడ్డి</strong>రాయచోటి రూరల్ (కడప): చంద్రబాబు సర్కార్ రైతులతో ఆడుకుంటోందని, ఇలా చేస్తే వారికి పుట్టగతులుండవ్ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ట్రాక్టర్ల కోసం ఎంతో ఆసక్తిగా దరఖాస్తులు చేసుకుంటున్న రైతులతో అధికార పార్టీ నాయకులు రాజకీయ చేయడం తగదన్నారు. తాము చెప్పిన వారికే ట్రాక్టర్లు ఇవ్వాలని పలువురి వ్యవసాయాధికారులకు ఎటువంటి అధికారాలు లేని అధికార పార్టీ నాయకులు హుకుం జారీ చేయడం హేయమైన చర్యగా ఆయన చెప్పారు. రైతు రథం అనే పేరు పెట్టి, రైతులపై ఏ మాత్రం అభిమానం చూపకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం నుంచి రూ.1.50లక్షల సబ్సిడీ ట్రాక్టర్లను తమ వారికే ఇప్పించే విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకురావడం దుర్మార్గమన్నారు. దీంతో పాటు ఫించన్లు, పక్కా గృహాలు , సబ్సిడీ రుణాలు, రేషన్ కార్డులు కూడా ఒక వర్గానికి చెందిన వారికే వస్తుండటం దారుణమన్నారు.<br/><strong>ట్రాక్టర్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా...</strong>ట్రాక్టర్ల కోసం ధరఖాస్తు చేసుకున్న వారిలో ప్రభుత్వం నుంచి ట్రాక్టర్లు పొందే వారికి కాకుండా, మిగిలిన రైతులకు రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మండలాల రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీతో ట్రాక్టర్లను ఇప్పించే బాధ్యత తీసుకుంటానని శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే ట్రాక్టర్ల కంపెనీ వారితో మాట్లాడానని, వారు అందుకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు.