బాబు టార్గెట్ అంతా కమీషన్లపైనే

  • నీటి ప్రాజెక్ట్ ల పేరుతో టీడీపీ నిధులు దోపిడీ
  • పోలవరం అసంపూర్ణం..బాబుకు కమీషన్లు సంపూర్ణం
  • వారం వారం పోలవరంలో బాబు రౌడీ మామూళ్లు వసూళ్లు
  • ప్రాజెక్ట్  పూర్తి చేయడం చేతగాక ప్రతిపక్షంపై విమర్శలు
  • బాబు సర్కార్ పై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని ధ్వజం
హైదరాబాద్ః పోలవరాన్ని పూర్తి చేయడం చేతగాక చంద్రబాబు ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం సిగ్గుచేటని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే  కాకాని గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. పోలవరం పేరు చెప్పి చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా దోచుకుంటున్నాడని కాకాని ఫైర్ అయ్యారు. కంప్లీషన్ పూర్తికాదని గ్రహించి చంద్రబాబు కమీషన్ల మీద టార్గెట్ పెట్టాడని విమర్శించారు. నీటి ప్రాజెక్ట్ ల పేరుతో ఇష్టానుసారం ముడుపులు పిండుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్ల లోపల పోలవరం పూర్తి చేస్తామని బాబు ప్రకటించారని గుర్తు చేశారు.  ఆ తర్వాత 2018లో పూర్తిచేస్తామని ఓసారి, 2019లో చేస్తామని మరోసారి బాబు మాట మార్చారని దుయ్యబట్టారు. అనుకున్న టైంకు పోలవరం పూర్తికాదని వాస్తవాలు తెలుసుకున్నాక బాబు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాడని విరుచుకుపడ్డారు. ఓ పక్క అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని చెబుతూ, మరో పక్క పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 

ప్రతి సోమవారం సందర్శన పేరుతో పోలవరం వెళ్లి చంద్రబాబు రౌడీ మామూళ్లు వసూళ్లు చేస్తున్నాడని కాకాని నిప్పులు చెరిగారు. వారం వారం బాబు సందర్శనకు వెళ్లేది మామూళ్ల కోసమే తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదని తేలిపోయిందన్నారు. పోలవరం అసంపూర్ణం, బాబుకు కమీషన్లు మాత్రం సంపూర్ణంగా ముడుతున్నాయని ఆరోపించారు. 2019నాటికి పూర్తిస్థాయిలో కేంద్రం నిధులతో పోలవరం పూర్తి చేస్తారో లేదో సమాధానం చెప్పాలని బాబును డిమాండ్ చేశారు.  ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేయడం బాబుకు తగదన్నారు. ఇప్పటికే రుణమాఫీ చేయకుండానే చేశానని చెప్పి బాబు రైతుల ఉసురు పోసుకున్నాడని అన్నారు. అనుకున్న టైంలో పూర్తిచేయాల్సిన బాధ్యత బాబుపై ఉందన్నారు. అధికారుల మీద నిందవేయడం, ప్రతిపక్షాలను విమర్శించడం బాబుకు తగదని, కమీషన్లు పక్కనబెట్టి, కంప్లీట్ పై శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు.  

ట్రాన్స్ రాయ్ కంపెనీకు పోలవరం నిర్మించే సత్తాలేదని, నిధులు సరిగా విడదల చేయకపోవడం వల్ల అడ్డంకిగా మారిందని అధికారులు చెబుతుంటే...జాప్యం చేస్తున్నారంటూ బాబు అధికారులపై నింద వేయడంపై కాకాని ధ్వజమెత్తారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు 25శాతం కూడ పూర్తి కాలేదు. డయాఫ్రం వాల్ 5శాతం కూడ పూర్తయింది లేదు. 48 గేట్లుంటే మూడు కూడ పూర్తయిన దాఖలాలు లేవని కాకాని అన్నారు. బాబు అధికారులను తప్పుబట్టి ట్రాన్స్ రాయ్ కు అండగా నిలుస్తున్నారంటే,  కమీషన్లు బాగా అందుతున్నాయి కాబట్టే పనులపట్ల సంతృప్తిగా ఉందంటున్నాడని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ అని ఒప్పుకోకుండా, ప్రతిపక్షం అడ్డుపడుతుందని బాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పోలవరంలో జరుగుతున్న అధికార దుర్వినియోగంపై మాట్లాడకుండా ఆత్మస్తుతి పరనింద పేరుతో ప్రతిదానికి ప్రతిపక్షాన్ని ఆడిపోసుకోవడం బాబుకు అలవాటైపోయిందని ఫైర్ అయ్యారు.  ప్రతిపక్షం నీకెక్కడ అవరోధం కల్పించింది బాబు, పదే పదే ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు. 

చంద్రబాబు నీవు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశావ్. ఏనాడైనా పోలవరం గూరించి ఆలోచన చేశావా అని కాకాని ప్రశ్నించారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక పోలవరం నిర్మాణానికి సంకల్పించాడని కాకాని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్న వైయస్సార్సీపీ పోలవరం పూర్తికావాలనే కోరుకుంటుందని  స్పష్టం చేశారు. పోలవరం రైతులకు గాకుండా బాబుకు వరంగా మారిందని, అది లోకేష్ పరమని ఎద్దేవా చేశారు . బాబు సన్ రైజ్ స్టేట్ ఏందో అనుకున్నామని,  రాష్ట్రంలో లోకేష్ రైజ్ అయితున్నాడు తప్ప ఇంకోటి లేదని చురక అంటించారు. అన్నీ లోకేష్ కు ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలకు ఏమీ ఉపయోగపడడం లేదన్నరు. విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి చేసే బాధ్యత అంతా కేంద్రానిదైనా..కమీషన్ల కోసం బాబు హోదాను తాకట్టుపెట్టి పోలవరాన్ని తెచ్చుకున్నాడని మండిపడ్డారు. బడ్జెట్ లో ఏనాడైనా పోలవరానికి ఘననీయమైన కేటాయింపులు జరిగాయా..? దానిపై బాబు ఏనాడైనా ప్రశ్నించాడా...? అని కాకాని నిలదీశారు. 

కమీషన్లు, కాంట్రాక్టులు, ముడుపులు తప్ప బాబుకు దేనిపైనా ఆసక్తి లేదని కాకాని ఎద్దేవా చేశారు. 2014 ఏఫ్రిల్ 1 నాటికి ఇరిగేషన్ కు సంబంధించి కాంపోనెంట్ కింద ఉన్న ఖర్చులను మాత్రమే కేంద్రం బరిస్తుందని సెంట్రల్ మినిస్టర్స్ చెప్పిన విషయాన్ని కాకాని గుర్తు చేశారు. 
ఆ రోజుకు రూ. 16వేల కోట్లున్న ప్రాజెక్ట్ ను  బాబు 40వేల కోట్లకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బడిముబ్బడిగా రేట్లు పెంచి ఇరిగేషన్ పేరుతో అవినీతి సంపాదన మూటగట్టుకుంటూ, దాన్ని ప్రజల మీద వేసే హక్కు బాబుకు ఎవరిచ్చారని కాకాని ప్రశ్నించారు. ఏపీ ప్రజలపై భారం వేయకుండా  పోలవరం పూర్తిచేయాల్సిన బాధ్యత బాబుపై ఉందని కాకాని అన్నారు. పోలవరం, పట్టిసీమ పేరుతో బాబు ఏవిధంగా దోపిడీ చేశారో ప్రధాన ప్రతిపక్షంగా తాము ఆధారాలతో సహా నిరూపించామన్నారు. కాగ్ కూడ ప్రభుత్వ తీరును తప్పుబట్టిందని కాకాని తెలిపారు. ఇప్పుడు మళ్లీ బాబు పట్టిసీమను పిండినట్టుగానే పురుషోత్తమపట్నం పేరుతో మరొ కొట్టుసీమ తెచ్చి ఎమ కొట్టుడు కొడుతున్నాడని విరుచుకుపడ్డారు.  
Back to Top