ప్రొద్దుటూరు దౌర్జన్యం వెనుక బాబుల హస్తం

* ఓటమి భరించలేక వాయిదా వేసుకొని పారిపోయిన టీడీపీ
* దౌర్జన్యం సృష్టించి రౌడీల్లా వ్యవహరిస్తున్న బాబు కౌన్సిలర్లు
* ప్రొద్దుటూరు ఘటన చంద్రబాబు రాక్షసపాలనకు ప్రతిరూపం
* ఏపీ సీఎం దళిత వ్యతిరేకి, అగ్రకుల అహంబావి  
* ఎంపీ శివప్రసాద్‌ మాటల్లో వాస్తవాలున్నాయి
* ఈ ఘటనపై ఈసీ కలగజేసుకొని ఎన్నిక సజావుగా నడిపించాలి
* వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో జరిగిన దౌర్జన్యం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌ల హస్తముందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌ల ఆదేశాల మేరకే టీడీపీ కౌన్సిలర్లు రౌడీయిజం ప్రదర్శించారని ఆరోపించారు. ప్రొద్దుటూరు చైర్మన్‌ ఎన్నిక వాయిదా విషయమై అంబటి రాంబాబు గుంటూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓడిపోతామనే భయంతో తెలుగుదేశం పార్టీ అలజడులు సృష్టించి, ఫర్నీచర్‌ ధ్వంసం చేసి వాయిదా వేసుకొని పారిపోయిందని ఎద్దేవా చేశారు. గెలవలేమనే దశలో కౌన్సిలర్లను కొనుగోలు చేయడానికి టీడీపీ నేతలు వరదరాజులురెడ్డి, కొత్త మంత్రి ఆదినారాయణరెడ్డి ఎన్నో కుట్రలు పన్నారని స్పష్టం చేశారు. వాయిదా తరువాత కౌన్సిలర్లుకు డబ్బులు వెదజల్లి, బెదిరింపులకు గురిచేసి ఎలాగైనా చైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి ముక్తియార్‌ను బలపర్చిన తరువాత బలం లేక టీడీపీ నేతలు మినిట్స్‌ బుక్‌ పట్టుకొని పారిపోవడం, ఎన్నికల అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యుడు వైయస్‌ వివేకానందరెడ్డినే ఓడించాం అని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు ప్రొద్దుటూరులో ఓడిపోతే తలకాయ ఎక్కడపెట్టుకోవాలో అనే భయం జొరబడిందన్నారు.  ఒక్క మున్సిపాలిటీ ఓడిపోతే నీ ముఖ్యమంత్రి తనం పోతుందా.. లేక లోకేష్‌ మంత్య్రుత్వశాఖలో ఏ శాఖ అయినా ఎగిరిపోతుందా అని ప్రశ్నించారు. 
ప్రజాస్వామ్యా.. లేక రాచరికమా..?
చంద్రబాబు తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. లేక రాచరిక, అరాచక వ్యవస్థలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని అంబటి అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి ముక్తియార్‌కు చంద్రబాబు, లోకేష్‌లు ఫోన్‌ చేసి చైర్మన్‌ బరి నుంచి తప్పుకోవాలని డబ్బులు, పదవులు ఆశచూపిస్తున్నారని మండిపడ్డారు. ఆయన లొంగకపోవడంతో ఎన్నిక వాయిదా వేసేందుకు యత్నించారన్నారు. టీడీపీ కౌన్సిలర్‌ మినిట్స్‌ బుక్‌ పట్టుకొని పారిపోయే స్థితికి దిగజారారంటే చంద్రబాబు రాక్షసరూపం బహిర్గతంగా కనిపిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ఓటమిని భరించలేని స్థితికి పడిపోయాడన్నారు. దౌర్జన్యాన్ని, అశాంతిని చంద్రబాబు పాలుపొసి పెంచుతున్నాడని, పాలుపొసి పెంచిన పాము పెంచిన వాడినే కాటేసి చంపిన చందంగా చివరికి అది బాబుకే ముప్పు అవుతుందని సూచించారు. టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యఖాండను పోలీసులు అరికట్టలేకపోయారన్నారు. కనీసం ఒక్కరిని కూడా కస్టడీలోకి తీసుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. చైర్మన్‌ ఎన్నిక జరిగే వరకు మున్సిపల్‌ హాల్‌ విడిచిపెట్టి వెళ్లకూడదని వైయస్‌ఆర్‌ సీపీ కౌన్సిలర్లు అక్కడే కూర్చున్నారని చెప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వారిపై దౌర్జన్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వాయిదా పడితే తిమ్మినబొమ్మిని చేసి కౌన్సిలర్లను కొనుగోలు చేద్దామని కుట్రపూరితమైన ఆలోచనలో ఉన్నారన్నారు. ఎన్నికల కమిషన్‌ కలగజేసుకొని కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని, రేపు ఉదయం 11 గంటలకు ఎన్నిక సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  ప్రొద్దుటూరులో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని అంబటి పిలుపునిచ్చారు. 
మీ ఎంపీనే లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇస్తుంటే సిగ్గులేదా.. బాబూ
రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై తోసిపుచ్చే ధోరణిలో ప్రభుత్వం పనిచేస్తుందని అంబటి ధ్వజమెత్తారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని రావెల కిషోర్‌ కుమారుడుపై కేసు పెడితే దానికి వెనుక వైయస్‌ఆర్‌సీపీ హస్తం ఉందన్నారు. ఇప్పుడు ఎంపీ శివప్రసాద్‌ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే దానిపై కూడా ప్రతిపక్ష హస్తం ఉందని బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. ఎంపీ శివప్రసాద్‌ వాస్తవాలు మాట్లాడారని అంబటి స్పష్టం చేశారు. ఎస్సీలకు మంత్రి పదవుల కేటాయింపులో జాప్యం జరిగిందని, దళితుల పట్ల చంద్రబాబు రాక్షసుడిగా వ్యవహరిస్తున్నారనే రీతిలో శివప్రసాద్‌ చెప్పారన్నారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితుల హృదయాలను గెలుచుకోలేవని చంద్రబాబు సూచించారు. మీ సొంత జిల్లాకు చెందిన సొంత పార్టీ నేత లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇస్తుంటే సిగ్గులేదా అని చంద్రబాబును నిలదీశారు. దళితులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నాడని, చంద్రబాబు దళిత, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి అంబటి ఆరోపించారు. బాబు అగ్రకుల అహంబావి అని చెప్పడానికి మంత్రివర్గ విస్తరణే నిదర్శనమని చెప్పారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిపై సొంత పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తే ఆ పార్టీ బాగుడిన దాఖళాలు లేవని అంబటి హెచ్చరించారు.
Back to Top