ఏ నిర్మాణం చేశారని దీక్షలు చేస్తున్నారు బాబూ!

టిడిపిని కాంగ్రెస్ లో
ఎప్పుడు విలీనం చేస్తున్నారు

చింపాజీని అలకరించి మిసి ఇండియా
పంపినట్లుగా బాబు పాలన

వైయస్ ఆర్ కాంగ్రెస్
నాయకులు తమ్మినేని సీతారాం

 విజయవాడ: తమది తెలుగు కాంగ్రెస్
పార్టీనా, పిల్ల కాంగ్రెస్ పార్టీనా అన్న దానిపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని,
ప్రజలను వంచించడానికే  చంద్రబాబు నవ
నిర్మాణ దీక్షలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మినేని సీతారాం
అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కోవర్టుగా పనిచేస్తున్నారని,అవన్నీ
ఇటీవలి కాలంలో బట్టబయలు అవుతున్నాయనీ, ఇక టిడిపిని కాంగ్రెస్ లో విలీనం చేయడమే
తరువాయిగా కనిపిస్తోందని ఆయన అన్నారు. విజయవాడ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో
ఆదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చింపాంజీని రెడమేడ్ దుస్తులతో
అలకరించి మిస్ ఇండియా పోటీలకు పంపినట్లుగా రాష్ట్రంలోని చంద్రబాబు పాలన ఉందని ఆయన
వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టిడిపి, బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు కుట్ర చేస్తున్నారంటూ
విమర్శలు చేసుకుంటూ, రాష్ట్రాన్ని వంచించాయని, ప్రజలను నిట్టనిలువునా మోసం చేయడంలో
ఈ దొందూ దొందే అని విమర్శించారు.

చంద్రబాబుకు వృద్ధాప్యం
వల్లనో ఏమో , పూర్తిగా మైండ్ ఆబ్సెంట్ తో పాలనను నిర్వహిస్తున్నారంటూ
ధ్వజమెత్తారు. ఎటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టకుండా రైతులు, యువత, విద్యార్ధులు
మొదలైన వారి బలవన్మరణాలకు కారణమవుతూ ఇప్పుడు చేస్తున్నవి శవ నిర్మాణాత్మక దీక్షలు
కాక మరొకటి కావని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 రుణమాఫీ జరగక,బ్యాంకుల
నుంచి రుణాలు రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారనీ, డ్వాక్రా మహిళల పరిస్థితి అగ్యమ గోచరంగా
ఉందనీ, కోటీ 70 లక్షల మందికి నిరుద్యోగులకు భృతి ఇస్తామంటూ ఎన్నికలకు ముందు
ప్రకటించి, తీరా ఇప్పుడే అనేక మార్పులతో 10 లక్షల మందికే ఇస్తామనీ, అది కూడా
ప్రకటించిన 2 వేల కాకుండా, వెయ్యి మాత్రమే అని చెప్పడంతో పాటు అది కూడా ఎప్పటి
నుంచి ఇస్తారో కూడా స్పష్టత ఇవ్వని చంద్రబాబుకు నిర్మాణ దీక్షలు చేసే అర్హత ఉందా
అని నిలదీశారు. అంతే కాకుండా విద్యార్దులకు సరైన సమయంలో ఉపకార వేతనాలు, పీజు
రీయింబర్స్ మెంటులు అందక పోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిల్లలు పిట్టల్లా
రాలుతుంటే నవనిర్మాణ దీక్షలు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు.

బాబు వస్తే జాబు అంటూ
యువతల్లో ఆశలు రేకెత్తించి, వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమవ్వడంతో యువత పెడదారి
పట్టక తప్పని పరిస్థితి తీసుకుని వచ్చారనీ, అసలు యువతరానికి దశా నిర్దేశం చేసేలా
యువ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకుండా, ఇంక నవ నిర్మాణ దీక్షల్లో అర్థమేముందంటూ
నిలదీశారు.

రాజకీయంగా ప్రజల్లో
సెంటిమెంట్ ను రాజేసి , వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోడానికి ప్రయత్నిస్తూ
పాలనను భ్రష్టు పట్టించారన్నారు. నాతి బొమ్మను గీస్తానంటూ, కోతి బొమ్మను
గీసినట్లుగా చంద్రబాబు పాలనలో నవనిర్మాణ దీక్షలు చేయడం అర్ధరహితమన్నారు. నిర్మాణాత్మకమైన
పాత్ర పోషించకుండా ఫేక్ పాలనను అందిస్తున్నారు. చింపాజీ ని నిలబెట్టి రెడీమెడ్
దుస్తులు తొడిగి మిస్ ఇండియా పోటీలకు పంపినట్లుగా ఉందని తమ్మినేని సీతారాం విమర్శించారు.

ఎప్పుడూ రెండు వేళ్లతో
విక్టరీ చూపించే చంద్రబాబు నాయుడు బెంగుళూరు వెళ్లి భస్మాసుర హస్తం చూపడమే ఆయన
కాంగ్రెస్ తో కలిసి పోయారనడానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. టిడిపిని కాంగ్రెస్ లో
విలీనం చేయడానికి మీరు ఎప్పుడో నిర్ణయించారనీ అది ఎప్పుడో చెప్పాలని డిమాండ్
చేశారు. కాంగ్రెస్ లో కలిసిపోతున్నామనే స్పష్టమైన సంకేతాలను ప్రజలకు ఇస్తూనే
ఉన్నారని అన్నారు. అంతే కాకుండా ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తనకు తెలుసునంటూ చంద్రబాబు
వ్యాఖ్యల వెనక మర్మం కూడా ఇదేనని ఆయన పేర్కొన్నారు.

అశోక్ బాబు ఎప్పటి నుంచో
టిడిపి కోవర్టే

ఇటీవలి కాలంలో చంద్రబాబు
నాయుడు తన పార్టీలోకి ఎందరినో ఆహ్వానిస్తున్నారని తాజాగా ఉద్యోగ సంఘాల నాయకుడు
అశోక్ బాబును పార్టీలోకి ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అతడిని కొత్తగా
పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనీ, ఆయన ఎప్పటి నుంచో టిడిపి కోవర్టుగానే
పనిచేస్తున్నారన్నారు.

Back to Top