సమైక్యంపై బాబు, కిరణ్‌కు చిత్తశుద్ధి లేదు

హైదరాబాద్:

రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే విషయంలో సీఎం కిరణ్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి సంజీవనిలా ఉపయోగపడే సమైక్య తీర్మానాన్ని అసెంబ్లీలో చేయకుండా సీఎం కిరణ్ ఎందుకు వెనుకాడుతున్నారో సమాధానం చెప్పాలని ‌ఆయన డిమాండ్ చేశారు. ‌పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ సమైక్య తీర్మానం చేయాలని తమ వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తూంటే పట్టించుకో‌లేదని, పైగా బిల్లుపై చర్చ వద్దన్నందుకు తమ పార్టీ విభజన కోరుతున్నదనే విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విభజనకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్, దానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ ఒక విధానమంటూ లేకుండా గందరగోళపడుతున్నాయన్నారు. మరోవైపు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని సమైక్యం ముసుగులో విభజన కోరుకుంటోందని ఎలా విమర్శిస్తాయని‌ ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో అసలైన, సిసలైన, నిఖార్సయిన సమైక్యవాదం వినిపిస్తున్నది వైయస్ఆర్‌సీపీయే అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నామన్నారు. ‘కాంగ్రెస్, టీడీపీల విధానం పార్టీపరంగా ఒకటుంటే ఆ పార్టీల ఎమ్మెల్యేలు కొందరు విభజనకు అనుకూలంగానూ, మరికొందరు వ్యతిరేకంగానూ ఉంటున్నారని అన్నారు.

తాను సమైక్యవాదినని సీఎం కిరణ్‌ చెబుతుందే కాంగ్రెస్ పార్టీలోని టీ-ఎమ్మెల్యేలు విభజనకు అనుకూలంగా, ఇతర ప్రాంతాలవారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా‌రన్నారు. విభజనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు లేఖ ఇస్తే ఆ పార్టీలోని రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలు భిన్నవాదనలు వినిపిస్తున్నారన్నారు. కానీ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, రాయలసీమ, కోస్తా ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత నేతలు అందరూ సమైక్యవాదననే వినిపిస్తున్నారు. అలాంటి వైయస్ఆర్‌సీపీని విభజనకు అనుకూలమైనదిగా విషప్రచారం చేసి నమ్మించాలని చూస్తే ప్రజలు నమ్మబోరు అని అంబటి స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ముందుకెళితే విభజనకు అంగీకరించినట్లేనని కొన్ని నెలల క్రితం చెప్పిన చంద్రబాబు ఇపుడు అదే జీఓఎం రూపొందించి పంపిన బిల్లుపైన చర్చకు ఎందుకు అంగీకరిస్తున్నారని అంబటి నిలదీశారు. బిల్లుపై చర్చకు అంగీకరించబోమని నిన్నటిదాకా చెప్పిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఇపుడెందుకు మాటమార్చి చర్చకు సిద్ధమయ్యారని, ఆజాద్ హైదరాబా‌ద్ వచ్చినపుడు టీడీపీ ఏమైనా ఒప్పందం కుదుర్చుకుందా! అని అనుమానం వెలిబుచ్చారు.

ముసాయిదా బిల్లుపై చర్చించాలనటం ధర్మం‌ కాదు :
పునర్వ్యవస్థీకరణ బిల్లును భోగిమంటల్లో వేయాలని ఏపీఎన్జీవో నేతలు ఇచ్చిన పిలుపుపై అంబటి హర్షం వ్యక్తం చేశారు. వారి నిర్ణయాన్ని తాము ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే.. భోగిమంటల్లో వేయాల్సిన బిల్లుపై ఎలా చర్చిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాలనడం పూర్తిగా అధర్మమన్నారు. అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే ముట్టడిస్తామని, మెరుపు సమ్మె చేస్తామని ఇదే నేతలు చెప్పిన మాటలు ఏమయ్యాయన్నారు. బిల్లుపై చర్చలో పాల్గొనని వారి ఇళ్లను ముట్టడిస్తామన్న ఏపీఎన్జీవో నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘దయచేసి నిప్పుతో చెలగాటమాడొద్దు. అసలు సిసలు సమైక్యవాదులైన వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ఇళ్లను నకిలీ సమైక్యవాదులతో కలసి ముట్టడించడమంటే నిప్పుతో చెలగాటమాడినట్లేనని గుర్తుంచుకోండి’ అని హెచ్చరించారు. ‘బిల్లుపై చర్చ జరగాలని టీఆర్‌ఎస్ కూడా కోరుకుంటోంది. మరి ఆ పార్టీ కూడా సమైక్యవాద పార్టీయేనా? విభజనవాదులను మీరు సమైక్యవాదులని అంటారా?’ అని అంబటి సూటిగా ప్రశ్నించారు.

Back to Top