స‌న్మాన‌దీక్ష‌లు

రాష్ట్రంలో దీక్ష‌ల సీజ‌న్ న‌డుస్తోంది. న‌మ్మ‌మ‌ని అడుగుతూ ఓ దీక్ష‌. న‌మ్మించాల‌ని ప్ర‌య‌త్నిస్తూ ఓ దీక్ష‌. వంచ‌న‌ను గుర్తు చేస్తూ దీక్ష‌. వంచిస్తూ మ‌రో దీక్ష‌. వీటితోపాటు స‌న్మాన దీక్ష‌లు కూడా ఊపందుకున్నాయి. కుళాయిలో నీళ్లిస్తే ధ‌న్య‌వాద స‌న్మానం. రేష‌న్ లో బియ్యం పోస్తే సంతోషాల స‌న్మానం. జీతాలిస్తున్నందుకు, ప‌రిపాలిస్తున్నందుకు ప‌దే ప‌దే స‌న్మానం.  జీతాలు పెంచినందుకు, పింఛ‌న్లు ఇస్తున్నందుకు నిన్న‌టిదాకా చంద్ర‌బాబు స‌త్కారాలు చేయించుకుని, అభిషేకాలు చేయించుకుంటుంటే, నేనేం త‌క్కువ తిన్నా అంటూ నారా లోకేష్ కూడా 30శాతం జీతాల పెంపు అని చెప్పి, ఖ‌జానానుంచి కోట్లు ఖ‌ర్చు చేయించి మ‌రీ ధ‌న్య‌వాద స‌న్మానం చేయించుకున్నాడు. అయ్య‌గారి వంత‌య్యాక కొడుకుగారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డేలోపు మ‌న‌వ‌డిగారి స‌న్మానం కూడా చూస్తామేమో!! ఎవ‌రు చెప్పొచ్చారు.

ప్ర‌భుత్వం అన్నాక ప్ర‌జ‌ల‌కు కావాల్సినవి చేయ‌దా? ఇన్నాళ్లూ ముఖ్య‌మంత్రులుగా ఉన్న‌వాళ్లు రాష్ట్రానికీ, ప్ర‌జ‌ల‌కూ ఏమీ చేయ‌లేదా? చేసినందుకు వాళ్లు ధ‌న్య‌వాదాలు, పూల‌దండ‌లు, స‌త్కారాలు కోరుకున్నారా? ఇలాంటివ‌న్నీ అడిగారంటే మీరు అభివృద్ధి నిరోధ‌కుల‌ని అర్థం అయిపోతుంది. అంతులేని అవినీతి చేస్తూ, అల‌విగాని అకృత్యాలు చేస్తూ కూడా ప్ర‌జ‌ల గురించి ఓ హామీ ఇవ్వ‌డం ఎంత గొప్ప విష‌యం! సొంత కుటుంబం గురించి, స్వీయ వ్యాపారం గురించి ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల బాగోగుల గురించి అఖ‌రి ఏడాదిలో ఆలోచించ‌డం ఎంత త్యాగ‌నిర‌తి. అలాంటి నాయ‌కుల‌కు కాక ఇంకెవ‌రికి చేయాలి స‌న్మానం. ఎన్టీఆర్ రూపాయికి కిలో బియ్యం ఇచ్చినా, వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ తెచ్చినా వాళ్ల‌కు స‌న్మానాలు జ‌ర‌గ‌లేదంటే .... ఎలా జ‌రుగుతాయి...ఎప్పుడూ ఏదో ఒక ప్ర‌జ‌ల వ్యాప‌కంలో ఉండి, ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేస్తే ప్ర‌జ‌ల‌కు మ‌క్కువ ఏముంటుంది? దిల్లీలు తిరుగుతూ, ప్ర‌ధానిని సార్ అంటూ ఇగో సాడిస్ఫై  చేస్తూ, ప్ర‌తిప‌క్ష నేతపై కేసులు పెట్టించేందుకు నానాతిప్ప‌లూ ప‌డుతూ, ఓటుకు నోటు భూస్థాపిత‌మ‌య్యే మంత్రాంగం న‌డిపిస్తూ, అమ‌రావ‌తి క‌ల‌ల‌ను ప్ర‌పంచానికి చూపిస్తూ ప్ర‌జ‌ల‌ను పాలించాలంటే మాట‌లా? ఇన్ని ప‌నులు చేసుకుంటూ సొంత కుటుంబానికి త‌ర‌త‌రాల‌కు స‌రిపాడా సంపాదించి ఇస్తూ ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నులు చేయ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నేనా? అందుకే నాలుగేళ్ల త‌ర్వాతైనా, ప్ర‌తిప‌క్ష నేత చెప్పిన‌వి కాపీ కొట్టి చేస్తున్నా బాబు చేసే ప‌నుల‌కు ప్ర‌జ‌లు స‌న్మానం చేయాల్సిందే. స‌త్కారం చేయాల్సిందే. ఆయ‌న క‌డుపున పుట్టినందుకు, ఒక్క ఓటు కూడా ప‌డ‌కుండా మంత్రి ప‌ద‌విలో కూర్చున్నందుకు, ముచ్చ‌ట‌గా మూడు తెల్గు ముక్క‌లు కూడా మాట్లాడ‌లేనందుకు, నాన్న‌లాగే నాలుగేళ్ల త‌ర్వాత ప్ర‌జ‌ల‌పై ప్రేమ కురిపిస్తున్నందుకు చిన‌బాబుకు కూడా ప‌నిలో ప‌నిగా స‌న్మాన కార్య‌క్ర‌మాలు చేసేయాలి. ఇంకా  చెప్పాలంటే ప‌సి వ‌య‌సులోనే అధికారిక కార్య‌క్ర‌మాల‌కు తాత‌తో క‌లిసి ప‌నిచేస్తున్న మ‌న‌వ‌డు దేవాంష్ కు కూడా త‌ప్ప‌క స‌న్మానం చేయాలి. థాంక్యూ సీఎమ్ అంటూ మాత్ర‌మే కాదు థాంక్యూ నారా ఫ్యామిలీ అంటూ స‌న్మానాల దీక్ష‌లు చేప‌ట్టాలి. ఊరూరా ఈ దీక్ష‌లు జ‌ర‌గాలి. నారా స‌న్మాన దీక్ష చేసిన‌వారు, చూసిన‌వారు ధ‌న్యుల‌వుతార‌ని ప‌చ్చ‌ప‌త్రిక‌లు ప‌తాక శీర్షిక‌ల్లో ప్ర‌చారం చేయాలి. 

తాజా వీడియోలు

Back to Top