తాడేపల్లి: మేనిఫెస్టో అంటే.. నీలా అరచేతిలో వైకుంఠం చూపించేది కాదు అంటూ చంద్రబాబుకు వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చురకలంటించారు. చంద్రబాబబు 2014లో వందల కొద్దీ హామీలు గుప్పించారని గుర్తు చేశారు. ఎన్నికలకు 15 నిమిషాలు ముందే ఆయన మేనిఫెస్టోను తీసేశాడు. అంతటితో ఆగకుండా ఈ రోజు ఎవరితోనైతే పొత్తు పెట్టుకున్నాడో..అప్పుడూ వాళ్లతోనే పొత్తు పెట్టుకుని ముఖ్యమైన హామీలంటూ వారి ఫోటోలతో మరో పత్రం ఇంటింటికీ పంపాడని తెలిపారు. ఆదివారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: *మేనిఫెస్టో అంటే తాయిలాలు గుమ్మరించేది కాదు:* – 2024 సార్వత్రిక ఎన్నికలకు నిన్ననే మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారు మేనిఫెస్టోను విడుదల చేశారు. – బహుశా మేనిఫెస్టోకు ఇంత ప్రాముఖ్యత రావడం కూడా..ఆ ఘనత కూడా వైఎస్సార్సీపీకే దక్కుతుంది. – 2019లో ఇచ్చిన మేనిఫెస్టోకు, దానికి ప్రాముఖ్యత ఇచ్చి కట్టుబడి ఉన్నాం. – దాని అమలులో 99 శాతం పైగా పూర్తి చేసి 2024 ఎన్నికలకు మళ్లీ సిద్ధం అయ్యాం. – దీంతో 2024 మేనిఫెస్టోపై కూడా అంచనాలు అధికంగా ఉన్నాయి. జగన్ గారు కొత్తగా ఏం చెప్తారా అని కూడా చాలా మంది ఎదురుచూశారు. – ఈ నేపథ్యంలో మేనిఫెస్టోపై నిన్నటి నుంచి రాష్ట్రంలో చర్చలు కూడా జరుగుతున్నాయి. – మేనిఫెస్టో అంటే తాయిలాలను కుమ్మరించేది అయితే అది మేనిఫెస్టో అనిపించుకోదు. – వచ్చే ఐదేళ్లలో మొత్తంగా రాష్ట్రం, అందులోని సమాజం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో చెప్పడం మేనిఫెస్టో లక్ష్యం. – ఏ ప్రజా సమూహానికి మనం మంచి చేయాలనుకుంటున్నామో వారికి ఐదేళ్లలో ఏం చేయబోతున్నామో చెప్పే ప్రయత్నం. ఈ రోజు అది అందరి చేతుల్లో ఉంది. – అలా కాకుండా తాయిలాలతో అరచేతిలో వైకుంఠం చూపించేది మేనిఫెస్టో కాదనేది మా అభిప్రాయం. – జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోకి ఒక కొత్త అర్ధం వచ్చింది. వైఎస్సార్సీపీ ఇస్తున్న మేనిఫెస్టో కదా అసలైన మేనిఫెస్టో అంటే అని ప్రజలు చెప్పుకుంటున్నారు. – అందుకే జగన్ గారు ఇచ్చే మేనిఫెస్టోకు ఇంత గుర్తింపు వచ్చింది. – దీంట్లో కేవలం తాయిలాల కోసమే వెతికే వాళ్లకు దీనిలో కొత్తగా ఏమీ కనిపించకపోవచ్చు. *మా మేనిఫెస్టోలో ఏమీ లేదన్నప్పుడు భయపడటం దేనికి చంద్రబాబూ?:* – ఇక నేచురల్గానే మేనిఫెస్టో విడుదల చేస్తుండగానే చంద్రబాబు, ఆయన వందిమాగధులు విమర్శలు మొదలు పెట్టారు. – పాత హామీలు ఏమయ్యాయని చంద్రబాబు నాయుడు మమ్మల్ని అడుగుతున్నాడు. – 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేసిన చంద్రబాబు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. – దీనిలో కీలకంగా 2014–19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపాన్ని చూపడం రాష్ట్ర మంతా చూసింది. – అలాంటి వ్యక్తి వచ్చి జగన్ గారు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏమీ లేదని మాట్లాడుతున్నాడు. – మరి మా మేనిఫెస్టోలో ఏమీ లేదని ఆయన భావిస్తే ఎందుకు నిన్న మమ్మల్ని అన్ని తిట్లు తిట్టాడో ఆయనకే తెలియాలి. – గతంలో మేం 750 హామీలు ఇచ్చామని చంద్రబాబు చెప్తున్నాడు. బహుశా ఆయన తలలో చిప్ పోయినట్లుంది. – 2014లో వందల కొద్దీ హామీలు గుప్పించింది చంద్రబాబు. ఎన్నికలకు 15 నిమిషాలు ముందే ఆయన మేనిఫెస్టోను తీసేశాడు. – అంతటితో ఆగకుండా ఈ రోజు ఎవరితోనైతే పొత్తు పెట్టుకున్నాడో..అప్పుడూ వాళ్లతోనే పొత్తు పెట్టుకుని ముఖ్యమైన హామీలంటూ వారి ఫోటోలతో మరో పత్రం ఇంటింటికీ పంపాడు. – అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీనికి రాష్ట్ర ప్రజలంతా సాక్ష్యం. – రుణమాఫీ అంటూ చేసిన వాగ్ధానంలో రూ.87వేల కోట్లకు పైగా ఉన్న రుణాల్లో కేవలం రూ.15 వేలు కోట్లు మాత్రమే చేశాడు. – మీరు బ్యాంకుల్లో పెట్టిన బంగారం కూడా ఇంటికి వస్తుందని చెప్పి మోసపు హామీలిచ్చి ఆయన చేసింది ఇది. – గ్యాస్ సిలిండర్లపై ఒక్కో దానికి వంద రూపాయల సబ్సిడీతో 12 సిలిండర్లు ఇస్తానన్నాడు. అది చేయలేదు. – నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేల అన్నాడు. ఇంటి స్థలం మూడు సెంట్లు అన్నాడు. ఏమీ చేయలేదు. – ఇచ్చిన హామీలు ఎగ్గొడటంతో పాటు 2014–19 మధ్య ఏమేమి అరాచకాలు చేశాడో, వాటి దుష్ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రజలు మర్చిపోలేదు. *మేనిఫెస్టో అంటే ప్రజలకు, నాయకుడికి మధ్య ఒక అనుబంధం:* – మేనిఫెస్టో అంటే ప్రజలకు, నాయకుడికి...ప్రజలకు, పార్టీకి మధ్య ఒక బంధం లాంటిది. – మేనిఫెస్టో అంటే ఒక ఒప్పందం, ఒక బాండ్ లాంటిది. నేను ఇది చేస్తాను అంటే చేసి చూపిస్తాడు అనేలా ఉండాలి. – ఎన్నికలు రాగానే అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి..ఎన్నికలు అయ్యాక దాన్ని చెత్తబుట్టలో వేయడం ఆయనకు అలవాటు. – మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరు ఈ సారి నేను కచ్చితంగా అమలు చేస్తాను అంటున్నాడు. – ఇలాంటి ఫక్తు 420 వాళ్లు చేసేదే రాజకీయం అనుకునే వాళ్లను ప్రజలు చీదరించుకుంటున్నారు. – 2019లో మేం ఇచ్చిన హామీలను నిలుపుకున్న తర్వాత ప్రజలకు కూడా మేనిఫెస్టో సీరియస్నెస్ ఏంటో తెలుస్తోంది. – రాజకీయ నాయకుడు అంటే వాళ్లు చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ల మధ్య జరిగే ఆట లాంటదని అనుకునే రోజులు పోయాయి. – అలాంటి భావన నుంచి నాయకుడు చెప్పింది చేస్తారా? చేయిపట్టుకుని నడిపిస్తారా అనేలా మేనిఫెస్టోకు అర్ధం వచ్చింది. థాంక్స్ టు జగన్మోహన్రెడ్డి గారు. – మా ధీమా, మా నమ్మకం అంతా ఇదే భావనపైనే. – మీ కుటుంబంలో మీకు మంచి జరిగింది అనుకుంటేనే ఆ మంచి ఇంకా కొనసాగాలంటే మీ ఆశీస్సులు ఇవ్వండని ఆత్మ విశ్వాసంతో జగన్ గారు అడగగలుగుతున్నారు. – నేడు పంటి బిగువున..ఇంత కష్టం మీద కోవిడ్ నష్టాలు, అదనపు ఖర్చుల వల్ల పడిన రూ.60వేల కోట్ల దెబ్బను అధిగమించి ఇచ్చిన హామీలు జగన్ గారు నెరవేర్చారు. – ఈ నేపథ్యంలో తదుపరి ఇచ్చే మేనిఫెస్టోపై ఆచితూచి అడుగులు వేయకపోతే ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. – అందుకే జగన్ గారు ఆచితూచి హామీలు ఇస్తున్నాడు. – కానీ చంద్రబాబు మాత్రం ఇష్టారీతిన అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది చెప్పేస్తున్నాడు. – ఉన్నట్లుండి పింఛన్ రూ.4వేలు అన్నాడు. అంతకు ముందు 50ఏళ్లకే పింఛన్ అంటున్నాడు. – ఆయన ఇచ్చిన హామీలన్నీ లెక్క తీస్తే రూ.1.50 లక్షల కోట్లు అవుతుంది. – మనం ఈ ఐదేళ్లలో అమలు చేసిన వాటికి రూ.70 వేల కోట్లు ఏడాదికి అయ్యింది. – అదీ లంచాలు, దోపిడీ లేకుండా చేయడం వల్ల నేరుగా ప్రజలకు రూ.70వేల కోట్లు చేరాయి. – ఇదంతా గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ వల్ల సాధ్యమైంది. – గత ప్రభుత్వాలు కూడా సంక్షేమం ఇచ్చినా దానిలో కొంత భాగం దళారులు, అవినీతి పరుల జేబుల్లోకి వెళ్లేవి. *బటన్ నొక్కి శ్రీలంకను చేశారు అన్నారు..ఇప్పుడవే హామీలిస్తున్నారు:* – బటన్లు నొక్కి నొక్కి రాష్ట్రాన్ని శ్రీలంక చేశారంటూ ఇదే కూటమి విమర్శలు చేశారు. – మరి వీళ్లే రూ.1.50 లక్షల కోట్ల సంక్షేమం అంటూ చెప్పడం చూస్తే ఇక్కడే మోసం కనిపిస్తుంది. – ఇంతకంటే మోసకారులు ఎవరైనా ఉంటారా? – ఎలాగూ ఇచ్చేది లేదు కదా అని రోజుకో వాగ్ధానం ఇచ్చుకుంటూ పోతున్నాడు. – ఎన్నికల తేదీ వచ్చే నాటికి ఇంకెన్ని హామీలు ఇస్తాడో..అది ఏ రూ.2లక్షల కోట్లు వెళ్తుందో అర్ధం కావడం లేదు. – అప్పు తీర్చే ఆలోచన లేని వాడు పది రూపాయల వడ్డీ అయినా సరే అన్నట్లు చంద్రబాబు తీరు ఉంది. – దీనికి 2014–19 మధ్య ఆయన ఎగ్గొట్టిన పథకాలే దీనికి సాక్ష్యం. – అవే కాదు..అంతకు ముందు నుంచి వస్తున్న ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి చేశాడా? – ఫీజ్ రీయింబర్స్మెంట్ కేవలం రూ.35వేలు మాత్రమే ఇచ్చాడు. అది కూడా దిగిపోయే నాటికి రూ.1800 కోట్లు బకాయిలు పెడితే మేము వచ్చి కట్టాం. – చంద్రబాబు హయంలో పింఛన్ల కోసం ఆఫీసుల చుట్టూ ఎలా తిరగాల్సి వచ్చేది? – నేడు ఒకటో తేదీన రావడం లేదంటూ అదే చంద్రబాబు, ఆయన మదీమాగదం గగ్గోలు పెడుతోంది. – వీళ్లే తమ బినామీలతో తప్పుడు ఫిర్యాదులిప్పించి వాలంటీర్ వ్యవస్థను ఆపించారు. – ఇప్పుడు అసలు వాళ్లే ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టినట్లుగా, ఒకటో తేదీన పింఛన్ ఇంటివద్దే ఇవ్వాలంటూ మాట్లాడుతున్నారు. – ప్రజాగ్రహం పెళ్లుబికుతుందని తెలిసి ఇప్పుడు మొదటి తేదీనే పింఛన్ ఇవ్వాలంటూ కనిపించిన వారి వద్దకల్లా వెళుతున్నారు. – అసలు మీరు ఏ రోజు మొదటి తేదీన పింఛన్ ఇచ్చారో చెప్పు చంద్రబాబూ? – మొదటి తేదీన ఇంటివద్దే పింఛన్ ఇవ్వడం, వాలంటీర్ల వ్యవస్థ అంతా జగన్మోహన్రెడ్డి గారి పేటెంట్. – రైతులకు విత్తనాలు, ఎరువుల కోసం రోజంతా భారీ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నీ హయాంలో లేదా? – ఆస్పత్రుల్లో ఉన్న సౌకర్యాలు ఏంటి.? ఆరోగ్యశ్రీని ఏ మేరకు మీరు అమలు చేశారో అందరూ చూశారు. – జగన్ గారు వ్యవస్థలనే క్రియేట్ చేసి, ఆ వ్యవస్థల ద్వారా సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు చేర్చారు. – పేదలు తమ కాళ్లమీద తాము నిలబడేందుకు ఈ వ్యవస్థలు మద్దతుగా నిలవాలని జగన్ గారు భావించారు. *రాత్రికి రాత్రి నువ్వు ఎలా సంపద సృష్టిస్తావ్ చంద్రబాబూ?:* – ఇప్పటి వరకూ చేసింది రేపు కంటిన్యూ చేస్తాను అని జగన్ గారు చెప్తున్నారు. – ఎన్ని లక్షల కోట్ల హామీలైనా ఇచ్చేద్దాం..నేను సంపద సృష్టిస్తానులే అంటాడు చంద్రబాబు. – ఇప్పటి వరకూ ఎంత సంపద సృష్టించావ్ అంటే మాత్రం సమాధానం ఉండదు. – రాత్రికి రాత్రి నువ్వు సంపద ఎలా సృష్టిస్తావు? ఇప్పుడున్న రూ.70 వేల కోట్లుకు నువ్వు అదనంగా రూ.80వేల కోట్లు ఎలా యాడ్ చేయగలుగుతావ్? – విశ్వసనీయత అనేది చాలా విలువైనది. ఒక సారి అది వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా అవసరం. – అందుకే బాధ్యతాయుతంగా జగన్ గారు మేనిఫెస్టో ఇచ్చారు. – చాలా మంది మనం కూడా చంద్రబాబులా హామీలు ఇవొచ్చు కదా అంటున్నారు..కానీ వాటిని నిలుపుకోవాలి కదా? – హామీ అనేది ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడకపోతే నేను రాజకీయాల్లోనే ఉండకూడదు అనే వ్యక్తి వైఎస్ జగన్. – రోజూ ఆడిన అబద్దమే మార్చి మార్చి చెప్తుంటే ఇక విశ్వసనీయత ఏముంటుంది? అలాంటి వారిని అబద్ధాల కోరు అంటారు. – చంద్రబాబుకు మరొక అలవాటు కూడా ఉంది. ఆయన సంక్షేమ పథకాలలో లబ్ధిదారులకు కోత వేయడం కూడా అలవాటు. – పింఛన్లు తీసుకుంటే బాబు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందు వెయ్యి రూపాయల చొప్పున 39 లక్షల మందికే ఇచ్చాడు. – జగన్ గారు అధికారంలోకి రాకముందే ఆర్థిక వనరులను అంచనా వేసుకుని అంచెలంచెలుగా పెంచుతున్నానన్నారు. *చంద్రబాబుకు మద్య నిషేదం గురించి మాట్లాడే అర్హత ఉందా?:* – మద్య నిషేదంపై ఎవరైనా పోరాటం చేస్తున్న నాయకులు మాట్లాడితే ఒక అర్ధం ఉంది. – పోయి పోయి చంద్రబాబు మద్య నిషేదం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. – ఇప్పుడు ఊరూరా తిరిగి క్వాలిటీ మద్యం ఇస్తానంటూ మద్యాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. – అసలు చంద్రబాబుకు మద్య నిషేదం గురించి మాట్లాడే అర్హత ఉందా? – మేం హామీ ఇచ్చాం..ఎందుకు చేయలేకపోయామో కూడా చెప్పాం. – కానీ మద్య నియంత్రణ దిశగా ఎన్ని అడుగులు వేశామో ప్రజలందరికీ తెలుసు. – బెల్ట్ షాపులు ఎత్తేశాం. పర్మిట్ రూమ్లు రద్దు చేశాం. మద్యం షాపులను 40 శాతం తగ్గించాం. – ఆ షాపులు కూడా లిక్కర్ సిండికేట్ చేతుల్లో కాకుండా ప్రభుత్వ నిర్వహణలో పెట్టాం. – మేం చేయగలిగింది చేస్తున్నాం. చేయలేకపోయినవి ఓపెన్గా ఒప్పుకుంటున్నాం. – అలా నువ్వు చెప్పగలవా చంద్రబాబు? – సీపీఎస్ విషయంలోనూ మాట్లాడుతున్నాడు. నిజమే మేం ఆరోజు చేస్తాం అని మాటిచ్చాం. – తర్వాత దాని సాధ్యాసాధ్యాలు పరిశీస్తే ఐదేళ్లలో భరించలేని భారం పడుతుందని గుర్తించి ఉద్యోగులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. – ఇదే సమయంలో ఉద్యోగులు అడుగుతున్న దానిలో న్యాయం ఉందని భావించి నష్టపోకుండా జీపీఎస్ తీసుకొచ్చాం. – నిబద్ధత లేకపోతే హామీని వదిలేసి ఉండొచ్చు..లేదంటే పోతే పోయిందిలే అని సీపీఎస్ పెట్టి ఉండొచ్చు. – కానీ జగన్ గారు అలాచేయలేదు. రాష్ట్రాన్ని బాధ్యతాయుతంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని భావించారు. – మరో వైపు ఉద్యోగులకూ న్యాయం జరగాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. – నిజంగా చంద్రబాబులా బూటకపు హామీలు ఇవ్వాలనుకుంటే ఎంత సేపు పని? – ఆయన చెప్పినట్లు మోసం చేసేది అయితే సిలిండర్లు మూడెందుకు..ఐదు కూడా ఇవ్వొచ్చు.. – రైతులకు మేం రూ.16వేలు చెప్పాం. చంద్రబాబులా ఎగ్గొట్టాలి అనుకుంటే రూ.30 వేలు చెప్పేవాళ్లం కదా? *చంద్రబాబు వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయి:* – అన్నిటి కంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఒక ఎకో సిస్టమ్ తయారవుతోంది. – అన్ని రైతులు, లబ్ధిదారుల వద్దకు వస్తున్నాయి. – జగన్ గారు ఒక నిర్ధిష్ట సమయం చెప్పి మరీ పథకాలు అందిస్తున్నారు. – ఫలితంగా లబ్ధిదారుడు కూడా ఫలానా టైంకి తనకు డబ్బు వస్తుందని ఒక టైంటేబుల్ కూడా తయారు చేసుకోవచ్చు. – ఇలాంటిది గతంలో ఎవరైనా ఊహించారా? ఎక్కడైనా జరిగిందా? ఒక్క జగన్మోహన్రెడ్డి గారు మాత్రమే చేశారు. – చంద్రబాబు వస్తే ఇలాంటి వ్యవస్థలన్నీ పోతాయి. ఈ వాతావరణమే చెడిపోతుంది. – నేడు సంక్షేమ లబ్ధిని అందుకుంటున్న వారికి అవన్నీ పోతాయి. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయి. – ఇప్పుడొస్తున్న 66 లక్షల పింఛన్లు ముప్పై లక్షలకు దిగిపోవచ్చు. – జన్మభూమి కమిటీ వల్ల ఎవరికి మంజూరు చేయాలో కూడా వారి కనుసన్నల్లోనే జరుగుతుంది. – పూర్తిగా ప్లాన్డ్గా బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన మేనిఫెస్టో ఇది. – ఈ మేనిఫెస్టోపై చంద్రబాబు మాటలకు జవాబు ఇవ్వడం కూడా అనవసరం. ఎందుకంటే ప్రజలకు అంతా తెలుసు. – మేనిఫెస్టోను జగన్ గారు ఎంత బాధ్యతాయుతంగా పెట్టారో కూడా ప్రజలు గమనించారు. – మా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గ్యారెంటీగా ఇచ్చేవి మాత్రమే కనిపిస్తాయి. – వాటిలో ఒక్కటి కూడా వదలకుండా మేం అమలు చేస్తాం. – చంద్రబాబు ఇచ్చే హామీలైతే ఆయనే ఎలాగూ చెత్తబుట్టలో పడేస్తాడు. – 2014–19 మధ్య ఎలా మోసం చేశాడో మళ్లీ అదే జరుగుతుంది. – ఇప్పుడు ఆయన చెప్పే పథకాలు కూడా అక్కడక్కడ కాపీ కొట్టి తీసుకొచ్చినవే. – ఇలాంటి అసంబద్ధ హామీలన్నీ గంపగుత్తగా తీసుకొచ్చి జనం ముందు ఉంచుతాడు. – ఆ తర్వాత ఐదేళ్లు జనం ముఖం చూడడు...ఇదీ చంద్రబాబు చరిత్ర. – చంద్రబాబుకు వేసే ప్రతి ఒక్క ఓటూ ఆరాచకపు పాలనకు నాంది పలుకుతుంది. – రాబోయేది బంగారు భవిష్యత్తు. చంద్రబాబు అండ్ కో నిరాశతో చెప్పే మాటలను నమ్మొద్దు. *చంద్రబాబుకు ఏమైనా అంతర్జాతీయ కిల్లర్ లైసెన్స్ ఇచ్చారా?:* – చంద్రబాబు తాను సభ్యసమాజంలో ఉన్నాను అనుకుంటున్నాడో లేదో, లేదంటే అంతర్జాతీయంగా ఆయకు కిల్లర్ లైసెన్స్ ఇచ్చారో ఏమో తెలియదు. – ఏకంగా ఒక బహిరంగ సభలో ఏకంగా ముఖ్యమంత్రి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని చంద్రబాబు అడుగుతున్నాడు. – దీన్ని సిల్లీగా తీసుకోడానికి లేదు. మొన్నెప్పుడు రాళ్లతో కొట్టండి అని చంద్రబాబు అనగానే విజయవాడలో జగన్గారిపై రాయి దాడి జరిగింది. – వాళ్ల మనుషులను ప్రేరేపించి జగన్ గారిపై దాడి చేయించారు. – ఆయన నిరాశతో మాట్లాడుతున్నాడా..లేక కోల్డ్ బ్లడెడ్ పథకం ప్రకారం మాట్లాడుతున్నాడా అర్థం కావడం లేదు. – ఆయన మాటలు చూస్తుంటే సభ్యసమాజంలో చంద్రబాబు ఉండదగ్గ వ్యక్తిగా కనిపించడం లేదు. – సరే రేపు ఎన్నికల్లో ప్రజలు ఎలాగూ తీర్పునిస్తారు. *నిజమైన సంపద సృష్టి జగన్ గారి హయాంలో జరుగుతోంది:* – సంపద సృష్టి అనే దానికి డెఫినేషన్ ఏంటో కూడా నిన్న సీఎంగారు చూపించారు. – చంద్రబాబు తన హయాంలో ఎలా రెవిన్యూ లోటులోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లాడో కూడా స్పష్టంగా వివరించారు. – ఈ ఐదేళ్లలో దాదాపు 90వేల కోట్ల పెట్టబడులు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. – భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రావడానికి కావాల్సిన వాతావరణాన్ని జగన్ గారు క్రియేట్ చేశారు. – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా మూడేళ్లు మనం మొదటి స్థానంలో ఉన్నాం. – నిజంగా సంపద సృష్టి అంటే ఈ తరుణంలో జరగాలి. అలాంటి వాతావరణం ఇప్పుడు క్రియేట్ అవుతోంది. – చంద్రబాబు మీడియాను తీసుకుని ఓ ఇరవై ఇళ్లకు వెళ్లమనండి. తన కుప్పంతో సహా అలా వెళితే వాస్తవాలు ఆయనకే అర్ధం అవుతాయి. – చంద్రబాబుకు అనే ఆలోచనే తప్ప..సమాధానం ఇచ్చే ఆలోచన లేనేలేదు. – చంద్రబాబు రూ.85 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయలేదు అంటున్నాం. లేదు నేను చేశాను అని చెప్పమనండి. – చంద్రబాబుకు నిజంగా ధైర్యం ఉంటే కుప్పంలోనైనా సరే పది నుంచి ఇరవై ఇళ్లు తిరిగి ఎవరి హయాంలో ఏ పథకాలో వచ్చాయో అడగాలి. – కచ్చితంగా చంద్రబాబు ఈస్ట్మన్ కలర్లో, మెరుపులు అద్ది హామీలిస్తాడు. వాటికి సూపర్ సిక్స్ ఎందుకు.సూపర్ హండ్రెడ్ అనొచ్చుగా. *మోసం చేయాలంటే పేర్లు మార్చి చెప్పొచ్చు..మేం అలా చేయం:* – నిన్న జగన్ గారు చెప్పింది రాష్ట్రం మొత్తం చాలా సీరియస్గా విన్నారు. – ప్రజలకు చేదోడుగా ఉండి వారికి సాయం అందించాం. వాటిని కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. – మేం ఏ ప్రాధాన్యాలైతే తీసుకుని ప్రజలకు అందిస్తున్నామో, మంచి ఫలితాలు ఇస్తున్నాయో వాటిని మళ్లీ కొనసాగిస్తాం అని చెప్తున్నాం. – మోసం చేయాలంటే వాటికే పేరు మార్చి చేయవచ్చు. – అలాంటి విధానంతో ప్రజలను మోసం చేయడం దేనికీ? వారి జీవితాల్లో మార్పులు వచ్చాయని ప్రజలు భావిస్తున్నారో వాటినే కంటిన్యూ చేస్తే సరిపోతుంది. – పథకాలు లేవే అనుకుంటే పొరపాటే. ఇవన్నీ పథకాలే..వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే పథకాలు. – చేసుకుంటూ పోయే వాటి గురించి కొత్తగా చెప్పడం దేనికీ అనేది జగన్ గారి ఆలోచన. – ఆర్బీకేలు ఒక వ్యవస్థ. దాని ద్వారా రైతులకు అందించే సేవలు మళ్లీ చెప్పడం అనవసరం. చేసుకుంటూ వెళ్లడమే. – జలయజ్ఞం అంతే. అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. పోలవరం పూర్తవుతుంది. రాయలసీమ లిఫ్ట్ వస్తే రాయలసీమ రూపురేఖలే మారిపోతాయి. – శ్రీశైలంలో తెలంగాణ 800 అడుగుల నుంచి నీరు తీసుకుంటుంటే అలానే మనం తీసుకోవాలనే ఆలోచనే చంద్రబాబుకు రాలేదు. – జగన్ గారు వచ్చిన తర్వాత మన హక్కుగా ఉన్న మేరకు రాయలసీమ లిఫ్ట్ డిజైన్ చేశారు. – ఇవన్నీ ప్రభుత్వ బాధ్యత..డ్యూటీ..వాటి గురించి ప్రత్యేకంగా హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. – చంద్రబాబే నిన్ను చంపితే ఏమవుతుంది అంటుంటే..ఇక దత్తపుత్రుడు బట్టలూడదీసి కొడతా అనడంలో ఆశ్చర్యం ఏముంది? – ఈ మధ్యే చంద్రబాబు కొడుకే పాపం ఎక్కడా కనిపించడం లేదు. – జగన్ గారు వచ్చిన తర్వాత ప్రజల ఇళ్లను కూడా తాకట్టు పెడతాం అనడం దారుణం. – అలా తాకట్టు పెట్టే అలవాటు చంద్రబాబుకే ఉంది. ఆయన సీఆర్డీయే భూములన్నిటీ తాకట్టు పెట్టాడు. – పచ్చ పత్రికలు ఒక అబద్ధాన్ని రాస్తాయి..దాన్ని ప్రచారం చేస్తారు.ఆ అబద్ధం నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు. – మొన్న కూడా ఇదే అబద్ధంగా సెక్రటేరియట్ తాకట్టు పెట్టారంటూ తప్పుడు రాతలు రాశారు. దాన్నే ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. – వాళ్లు అబద్ధాలపైనే మేడలు కట్టారు. మళ్లీ ఆ అబద్ధాలతోనే అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కానీ అది భ్రమే. – ఇటు వైపు బలమైన జగన్ గారిపై గడ్డిపూచలన్నీ వచ్చి కట్టి పడేయాలని చూస్తున్నాయి. – కానీ ప్రజలు జగన్ గారివైపు ఉన్నారు. ప్రజలు ఆయన్ను రక్షించుకుంటారు.