తాడేపల్లి: ఎన్నికల షెడ్యూల్ వల్ల వెసులుబాటు వచ్చిందని, ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలని, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైయస్ఆర్సీపీ పార్టీ రీజనల్ కో ఆర్డీనేటర్ల సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో సాగిన ఈ సమావేశంలో వైయస్ జగన్ బస్సుయాత్ర, రూట్ మ్యాప్, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. మూడు పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యచరణపై పార్టీ నేతలకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. మే 13న ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు. ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలన్నారు. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్నీ సదర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. ఈమేరకు అభ్యర్థులు కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. దీనిపై పార్టీకి చెందిన రీజినల్ కో-ఆర్డినేటర్లు వారికి మార్గనిర్దేశం చేయాలన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్లమెంటు నియోజకవర్గాల్లో మార్పులు చేశామని, అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నారు. ఆయా నియోజకవర్గాలలోని పార్టీ శ్రేణులును, నాయకత్వాన్ని సంఘటితపరిచి, వారిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకునడవాలన్నారు. పార్టీ లక్ష్యం సాధించే దిశలో కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకుని , ఘనవిజయాలు నమోదు చేయాలన్నారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు తమతమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిలవాలన్నారు. అలాగే బస్సు యాత్ర ప్రారంభమవుతున్నందున దీనికి అన్నిరకాలుగా సిద్ధంకావాలని, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ సభలు చరిత్రాత్మకం కావాలని వైయస్ జగన్, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు.