ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భూ అక్రమాలు, అధికారుల వైఖరికి నిరసనగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాకు నేతృత్వం వహించిన ఉరవకొండ వైయస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పార్టీ కార్యాలయం నుంచి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా తరలించారు. అలాగే పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. - హైకోర్టు ఆదేశాల కంటే మంత్రి ఆదేశాలే ముఖ్యమా?: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విడపనల్ మండలం వేల్పుమడుగులో వైయస్సార్సీపీ నాయకుడు గోవింద్కు చెందిన 21 ఎకరాల ప్రైవేటు భూమిపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఆ భూమి ప్రైవేటు ఆస్తేనని రెవెన్యూ అధికారులు గతంలో స్పష్టం చేశారని, హైకోర్టు కూడా అనుకూల ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిళ్లతో పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. - భూ అక్రమాలపై ఉద్యమం కొనసాగుతుంది ప్రైవేటు ఆస్తులపై అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అధికార పార్టీ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న భూ అక్రమాలపై వైయస్సార్సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. - అరెస్టులతో ఉద్యమాన్ని అణచలేరు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరైంది కాదని వైయస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. అరెస్టులు, హౌస్ అరెస్టులు, పోలీసు నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయలేరని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.