తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడితే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తప్పుపట్టారు. రాధాకృష్ణ మహిళలను ఉద్దేశించి కొత్త పలుకు పేరుతో రాసిన కథనాలు, ఆయన వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా అని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పుత్తా శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపినా తట్టుకోలేకపోతున్నారని, కానీ సాక్షి కార్యాలయంపై దాడులు జరిగినప్పుడు ఎందుకు మౌనం వహించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మావిగన్ అంశం చంద్రబాబుకు ఉరితాడుగా మారిందని, అమరావతి వ్యవహారాల్లో నిజాలు బయటపడుతుండటంతో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏబీఎన్ ద్వారా తమ పార్టీపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలను సమర్థించడం సరికాదని, అలాంటి వ్యాఖ్యలు తమ కుటుంబాలపై వస్తే సహిస్తారా అని నిలదీశారు. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని, అసభ్యకర రాతలను ప్రచారం చేయకూడదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు కాపాడాలని, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని పుత్తా శివశంకర్ స్పష్టం చేశారు.