రెండున్న‌రేళ్లుగా నాపై త‌ప్పుడు ప్ర‌చారం

నిజం బయటకు తేలాలని నేను కూడా భగవంతుడుని కోరుకుంటున్నా

సీబీఐ నోటీసుల‌పై స్పందించిన వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా: గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబపై ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానని, తాను, తన వ్యవహార శైలి ఏంటో జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. న్యాయం గెలిచి, నిజానిజాలు వెల్లడి కావాలన్నదే తన ధ్యేయమన్నారు. 

సీబీఐ నోటీసులపై ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం విచారణకు హాజరవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారని, అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల షెడ్యూల్స్‌ ప్రకారం నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు సీబీఐ అధికారులకు వెల్లడించినట్లు ఎంపీ తెలిపారు. విచారణకు ఐదు రోజుల సమయం కావాలని కోరినట్లు చెప్పారు. తరువాత సీబీఐ ఎప్పుడు పిలిచినా విచారణకు తప్పకుండా హాజరవుతానని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని వెల్లడించారు.

నిజం బయటకు తేలాలని తాను కూడా భగవంతుడుని కోరుకుంటున్నాన‌ని, ఆరోపణలు చేసేవారు మరొకసారి ఆలోచించుకోవాల‌ని సూచించారు. ఇలాంటి నిరాధారమైన ఆరోప‌ణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోవాల‌ని ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి అన్నారు. 

Back to Top