కర్నూలు: ఖోవా బన్స్ అమ్ముతూ జీవనోపాధి సాగిస్తున్న షేక్షావలి, జావీద్పై తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఘటన దురదృష్టకరమని వైయస్ఆర్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ఖాన్ ఖండించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన మేడారం జాతర సందర్భంగా కొంతమంది యూట్యూబర్ల వేధింపులను ఎదుర్కొన్న ముస్లిం విక్రేతలకు హఫీజ్ఖాన్ మద్దతుగా నిలిచారు . సోమవారం బాధితులు షేక్షావలి, జావీద్ కుటుంబాలను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో గిరిజన జాతర సందర్భంగా వలి తన ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ ఆహారమైన ఖోవా బన్ను అమ్ముతున్నాడు. యూట్యూబర్ల బృందం ఒకరు వలి అమ్ముతున్న ఆహారాన్ని అతనితో తినించారని, సమాజంలో విభేదాలు సృష్టించేందుకు ఒక యూట్యూబర్ వారిని వేధించడం, వారి సరుకును పారేయడం, బెదిరించడం బాధాకరమని తప్పుపట్టారు. కష్టపడి నిజాయితీగా జీవనం సాగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకోవడానికి ఎవరికీ హక్కు లేదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం పూర్తిగా తప్పు. సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వలి, జావీద్ ఒంటరి కాదని, వారికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.