విజయవాడ: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు సక్రమంగా జరగలేదని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఒడిషాకు ఆదాయం వెళ్లేలా రైల్వే జోన్ ఉందని తెలిపారు. రైల్వే జోన్ సాధనకు వైయస్ఆర్సీపీ రాజీలేని పోరాటం చేసిందని ఆయన చెప్పారు. గురువారం విజయవాడ పార్టీ కార్యాలయంలో తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉంటుందని, కానీ డివిజన్ ఉండదన్నారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో కలిసి ఏర్పాటు అవుతున్న రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. రావాణా అంతా కూడా ఈ రోజు ఒడిషాకు ఇచ్చారన్నారు. ఉపాధి అవకాశాలు కూడా ఆ రాష్ట్రానికి ఇచ్చారన్నారు. గూడ్స్ రావాణ అంతా కూడా రాయఘడ్కు ఇచ్చారన్నారు. ఇక్కడ రిక్రూట్మెంట్ మాత్రం విశాఖలో జరుగుతుందన్నారు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కొత్త వలస లైన్ కోసం వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ఢిల్లీని కేంద్రంగా చేసుకొని కూడా పోరాటం చేశామని చెప్పారు. ఇప్పుడు తలకాయ లేని మొండెంగా విశాఖను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎందుకు నల్లదుస్తులు ధరించి ర్యాలీలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని అన్ని హామీలు నెరవేర్చి రావాలా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు అన్ని నెరవేర్చిన తరువాత ఎన్నికలకు వెళ్తున్నారా అని నిలదీశారు. టీడీపీ వెబ్ సైట్లో ఆ పార్టీ మేనిఫెస్టో లేదనన్నారు. మోడీని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అంశాలు ఉన్నాయన్నారు. ఆదాయాలన్నీ ఒక వైపు..జోన్ మాత్రమే విశాఖకు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మారోమారు పునర్ పరిశీలన చేయాలని డిమాండు చేశారు. చంద్రబాబు ఏవిధంగా పేదవారో చెప్పాలని, ఆస్తులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా అని నిలదీశారు. చంద్రబాబుపై చాలా ఆరోపణలు ఉన్నాయని, ఆయన నిజాయితీని సీబీఐ విచారణ ద్వారా నిరూపించుకోవాలని సవాలు విసిరారు. చంద్రబాబును ఏదో ఒక ఆసుపత్రిలో చేర్పించాలని టీడీపీ నేతలకు సలహా ఇచ్చారు. చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని, ఈ క్షణంలో చెప్పినవి వెంటనే మరిచిపోతున్నారన్నారు. వైయస్ఆర్సీపీ తీసుకున్న ఏ నిర్ణయమైనా పారదర్శకమే అన్నారు. లింగమనేని దురాక్రమణలపై విచారణ జరిపించే సత్తా ఉందా అని నిలదీశారు.