తాడేపల్లి: రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి కూటమి ప్రభుత్వ దారుణ వైఫల్యమే కారణమని, వారి అలసత్వ విధానాల వల్ల రైతాంగం వేల కోట్ల రూపాయలు నష్టపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని మండిపడ్డారు. గతంలో వైఎస్.జగన్ ప్రభుత్వ హయాంలో క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, కచ్చితమైన డేటాతో రైతులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునేవారని, ప్రతిసారీ మద్దతు ధరతో పాటు సున్నా వడ్డీ రుణాలను అందించి రైతాంగానికి అండగా నిలిచారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్బాటాలకు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన కనీస మద్దతు ధరలు అమలుకు నోచుకోకపోవడం, గ్రేడింగ్ ధరల ప్రకటనలతో కంపెనీలకు మరింత లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తుండటంతో పొగాకు సరాసరి ధర పడిపోయి కిలోకి రూ. 60 దాకా నష్టపోతూ రైతులు కోలుకోలేని దెబ్బ తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు టొబాకో బోర్డులో వేలం వివరాల నివేదికలను దాచిపెడుతూ పారదర్శకతను సైతం దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రైతుల తరఫున క్షేత్రస్థాయి పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైందని నాగిరెడ్డి ప్రకటించారు. గతంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో ఇచ్చిన హామీ మేరకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వేలం కేంద్రాలను సందర్శించబోతున్నారని తెలిపారు. అక్కడ ఆక్షన్ కేంద్రాలను పరిశీలించి, రైతులతో ముఖాముఖి మాట్లాడి, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను మరియు సంక్షోభ తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే.. దేవరపల్లి ఆక్షన్ ప్లాట్ఫామ్కు వైఎస్ జగన్ – క్షేత్రస్థాయి పరిశీలన.. జూలై 22న వైఎస్ జగన్ ని కలిసిన పొగాకు రైతులు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను వివరించారు. రైతుల అభ్యర్థన మేరకు రేపు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వేలం కేంద్రానికి వైఎస్ జగన్ వెళ్తున్నారు. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. రూ.3000 కోట్ల నష్టం – ప్రభుత్వం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలోనూ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏదో పెద్ద ఎత్తున పొగాకు రైతులకు మేలు చేసినట్లు ప్రకటనలు ఇస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే అధికారిక డేటా ప్రకారమే కిలోకి రూ.40 నుంచి రూ.60 వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ రెండు సీజన్లలో కలిపి పొగాకు రైతులకు రూ.3000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 18, జూలై 8 తేదీలలో సమీక్షలు నిర్వహించి రూ.200 కంటే తక్కువకు కొనుగోలు చేయకూడదని చెప్పారు. అయినా అన్ని ప్లాట్ఫామ్లలో సరాసరి ధర రూ.187కే పడిపోయింది. మళ్ళీ ట్వీట్లో లో-క్వాలిటీకి రూ.110 అని పెట్టడం వల్ల కంపెనీలు ధరలు మరింత తగ్గించి కొంటున్నాయి. టొబాకో బోర్డు పారదర్శకతకు తూట్లు.. పొగాకు రైతులు రాజకీయాలకు సంబంధం లేకుండా రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు రెండు సార్లు రివ్యూ మీటింగ్లో కనీస ధర రూ. 200 కంటే తక్కువగా కొనకూడదని ప్రకటించారు. అయినా వేలం కేంద్రాల్లో ధరలు రూ. 200 లోపే కొనసాగుతున్నాయి. జూలై 28న ట్వీట్ ద్వారా హై క్వాలిటీకి రూ. 240, మీడియం రూ.190, లో గ్రేడ్ రూ. 110 ధరలు ప్రకటించారు. వాస్తవంగా దక్షిణాది వేలం కేంద్రాల్లో సరాసరి ధర రూ. 187 మాత్రమే ఉంది. కేంద్ర మంత్రి రూ. 50,000 వడ్డీ లేని రుణం ప్రతి బేరన్కి ఇస్తామని ప్రకటించారు. 2023-24 సీజన్లో సరాసరి ధర రూ. 288.65, 2024-25లో రూ.248.66 ఉంటే.. ఈ ఏడాది 105 వేలం రోజుల్లో 47.39 మిలియన్ కేజీలు అమ్మకం జరగ్గా సరాసరి ధర రూ. 214.19. మాత్రమే ఉంది. రైతులు గత సంవత్సరం కంటే కిలోకి రూ. 40 నష్టపోతున్నారు. ఉత్పత్తి వ్యయం కిలోకి రూ.20 పెరిగింది, మొత్తం నష్టం దాదారు రూ. 60 వరకు వస్తుంది. కూటమి పాలనలో రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో జీరో వడ్డీ రాయితీ రైతులకు ఇవ్వలేదు. రైతులు కనీస ధరను ప్రభుత్వం మార్కెట్లో అమలు చేయాలని కోరుతున్నారు. రైతులు కనీసం రూ. 200 ధరతో ప్రభుత్వ కొనుగోలు ప్రారంభించి పోటీ పెంచాలని కోరుతున్నారు. గత 10 ఏళ్లుగా ప్రతిరోజూ వేలం ముగిశాక వచ్చిన బెయిళ్లు, రిజెక్ట్ అయినవి, సరాసరి ధరల వివరాలను రైతు గ్రూపుల్లో పెట్టేవారు. కానీ గత 10-12 రోజుల నుంచి ఈ నివేదికను రైతులకు అందుబాటులో లేకుండా తీసేశారు. ప్రభుత్వం, టొబాకో బోర్డు అసలు ఏం దాచాలని చూస్తున్నాయి? పారదర్శకత అంటే ఇదేనా?. రైతుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తున్నారు.. బేరన్కు రూ.50,000 వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పడం రైతుల ఆత్మాభిమానాన్ని కించపరచడమే. వైఎస్ జగన్ హయాంలో ప్రతి సీజన్లో సున్నా వడ్డీ రాయితీని రైతులకు చెల్లించాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు రబీ, రెండు ఖరీఫ్లు గడిచినా సున్నా వడ్డీ కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. డెల్టాలో వరి సాగు చేయొద్దనడం అనాలోచిత నిర్ణయం.. కృష్ణా డెల్టా చరిత్రలోనే ఖరీఫ్లో నీళ్లివ్వం, వరి సాగు చేయొద్దని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఇది. డెల్టా భూముల్లో వరి, చెరుకు, ఆక్వా తప్ప వేరే మెట్ట పంటలు వేస్తే వర్షానికి దెబ్బతింటాయి. పట్టిసీమ నుంచి 6,800 క్యూసెక్కులు వస్తుంటే, పులిచింతలలో 29 టీఎంసీల నీళ్లు ఉంటే.. నీళ్లు విడుదల చేయకపోవడం దారుణం. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో ప్రాజెక్టులు నిండి శ్రీశైలానికి వరద వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఐదు లిఫ్టుల ద్వారా నీటిని తోడుకుంటూ సాగునీరు ఇస్తుంటే, మన ప్రభుత్వం మాత్రం కెఆర్ఎంబీ పర్మిషన్ల పేరుతో రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా తాగునీటి సంక్షోభంలోకి నెడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు చేరుతుండగా, తెలంగాణ ప్రభుత్వం తన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా సాగునీటిని వినియోగించుకుంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అనుమతుల పేరుతో ఆలస్యం చేస్తోంది. రాయలసీమలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ హంద్రీ-నీవా, కేసీ కెనాల్కు అవసరమైన నీటిని విడుదల చేయడం లేదు, ఇదే సమయంలో కృష్ణా డెల్టా రైతులకు వరి సాగు చేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడం అసంబద్ధం. కృష్ణా డెల్టాలో ఖరీఫ్లో వరి సాగు తప్ప ఇతర పంటలు సాధ్యం కాదని, ఈ విషయాన్ని రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అందరూ బాగా తెలుసు. పట్టిసీమ ద్వారా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కు నీరు వస్తోంది, పులిచింతల ప్రాజెక్టులో కూడా తగినంత నీటి నిల్వలు ఉన్నాయి. రోజుకు అవసరమైన మేర నీటిని విడుదల చేస్తే దాదాపు పది లక్షల ఎకరాలకు పైగా వరి సాగు సాఫీగా సాగుతుంది. అలాంటి అవకాశం ఉండగానే 2027 జూన్ వరకు తాగునీటి కోసం నీటిని నిల్వ ఉంచుతున్నామని చెప్పడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రెండేళ్ల దాటినా ఇంకా గత ప్రభుత్వంపై నిందలా..? కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిపోతుంది. ఇప్పటికీ రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ... ఇంకా గత ప్రభుత్వంపైనే నెపం నెట్టే ప్రయత్నం మానుకోవాలని నాగిరెడ్డి హితవు పలికారు. ఇప్పటికైనా ప్రచార ఆర్బాటాలు, గత ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకుని... మార్కెట్ జోక్యం చేసుకుని పొగాకు రైతులకు కనీస ధర రూ.200 దక్కేలా చూడ్డంతో పాటు, వెంటనే పులిచింతల, పట్టిసీమ నీటిని వినియోగించి కృష్ణా డెల్టాను, మచ్చుమర్రి ద్వారా కేసీ కెనాల్, హంద్రీనీవాలను నింపి రాయలసీమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.