విశాఖ నీటి సంక్షోభంపై వాసుపల్లి వార్

2 టీఎంసీలు అంటే మూడు అక్షరాలు కాదు భరత్‌.. డేటా సెంటర్‌కు 180 కోట్ల లీటర్లు ఎలా ఇస్తారు?

రోజుకు 40 కోట్ల లీటర్ల అవసరం.. 32 కోట్ల లీటర్లే సరఫరా

ఖాళీ బిందెలతో మహిళల నిరసన.. నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్

విశాఖపట్నం: విశాఖ నగరంలో తీవ్రమవుతున్న నీటి సంక్షోభంపై దక్షిణ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగదాంబ జంక్షన్‌ వద్ద శుక్రవారం వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ చైర్మన్‌ జాన్‌ వెస్లీ, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంతో జగదాంబ జంక్షన్‌ పరిసరాలు నినాదాలతో మార్మోగాయి.

విశాఖలో నీటి సంక్షోభం దారుణం

విశాఖ నగరానికి ప్రతిరోజూ సుమారు 40 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుండగా, ప్రస్తుతం 32 కోట్ల లీటర్ల మేర మాత్రమే సరఫరా అవుతోందని వాసుపల్లి గణేష్‌కుమార్‌ తెలిపారు. రోజుకు 8 కోట్ల లీటర్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులకు ఒకసారి నీరు వస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో కలుషితమైన నీరు సరఫరా అవుతోందని తెలిపారు.

 2 టీఎంసీలు అంటే మూడు అక్షరాలు కాదు

విశాఖ ఎంపీ భరత్‌ 2 టీఎంసీల నీరు మాత్రమే అవసరమన్నట్లుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వాసుపల్లి పేర్కొన్నారు. టీఎంసీ అంటే మూడు అక్షరాల పదం కాదని, దాని వెనుక ఉన్న నీటి పరిమాణాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. నగరానికి అవసరమైన 8 కోట్ల లీటర్ల కొరతను కూడా తీర్చలేని పరిస్థితుల్లో భారీ ప్రాజెక్టులకు నీటిని ఎలా అందిస్తారని ప్రశ్నించారు.

 డేటా సెంటర్‌కు 180 కోట్ల లీటర్లు ఎలా?

విశాఖలో ప్రతిరోజూ 180 కోట్ల లీటర్ల నీటి అవసరం ఉండే డేటా సెంటర్‌ వస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని వాసుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. నగర ప్రజల అవసరాలకే నీరు అందించలేని పరిస్థితుల్లో ఇంత భారీ స్థాయిలో నీటి అవసరాన్ని ఎలా తీర్చగలరని ప్రశ్నించారు. డేటా సెంటర్‌ పూర్తికాకముందే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో విశాఖ ఎదుర్కొనే నీటి సంక్షోభం మరింత భయంకరంగా మారుతుందని హెచ్చరించారు.

 ఎండిపోయిన జలవనరులు

మేఘాద్రిగెడ్డ, ముడసర్లోవ డ్యామ్‌లు ఎండిపోవడం, బోరుబావుల్లో నీటిమట్టాలు తగ్గిపోవడం ఆందోళనకర పరిణామాలని వాసుపల్లి తెలిపారు. నీటి కోసం పశుపక్షాదులు కూడా అడవులను వదిలి రోడ్లపైకి వస్తున్నాయని పేర్కొన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజలు కూడా విశాఖను వదిలి వలస వెళ్లే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

 నీటి సరఫరాకు కేవలం 5 శాతమేనా?

జీవీఎంసీకి సుమారు రూ.4,500 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ నీటి సరఫరాకు కేవలం రూ.250 కోట్ల మేరే ఖర్చు చేస్తున్నారని వాసుపల్లి తెలిపారు. మరోవైపు ప్రచార ఆర్భాటాలు, ఇతర కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ నిధులను విశాఖ మౌలిక వసతులు, నీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి వినియోగిస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

  జగన్‌ పాలనలో నిరంతర నీటి సరఫరా

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించిందని వాసుపల్లి గుర్తుచేశారు. దక్షిణ నియోజకవర్గంలో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలకు నిరంతరం నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

 డేటా సెంటర్‌పై పునరాలోచించాలి

విశాఖ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సంక్షోభానికి తక్షణ పరిష్కారం చూపాలని వాసుపల్లి గణేష్‌కుమార్‌ కోరారు. ప్రజల నీటి అవసరాలు తీరిన తర్వాతే భారీ నీటి వినియోగ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న నిర్ణయాలను పునఃపరిశీలించాలని స్పష్టం చేశారు.

  పవన్‌ కళ్యాణ్‌ ప్రాధాన్యత ఏంటి?

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రజల సమస్యలపై స్పందించకుండా ఏనుగుల మేత వంటి అంశాలకే పరిమితమవుతున్నారని వాసుపల్లి విమర్శించారు. విశాఖలో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో డిప్యూటీ సీఎంగా ఆయన ప్రాధాన్యతలు ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు.

 నీటి సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలి

ఈ సందర్భంగా రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ చైర్మన్‌ జాన్‌ వెస్లీ మాట్లాడుతూ విశాఖలో నెలకొన్న నీటి సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించేలా శాశ్వత చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నగర, వార్డు స్థాయి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వాసుపల్లి గణేష్‌కుమార్‌ స్పష్టం చేశారు.
 

Back to Top