అమరావతి: మీ అందరి దీవెనలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా ఉండాలని పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. మహానేత వైయస్ రాజశేఖర్రెడ్డి ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు,ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ వందనాలు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా 12, మార్చి 2011న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజానేతగా ఎదిగారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ జనబాహుళ్యం మెచ్చిన నేతగా మన్ననలందుకున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజలలో మమేకం అయిన వైఎస్ జగన్కు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనం పట్టం కట్టారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు.