న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విభజన చట్టంలోని హామీలపై ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు కావొస్తున్నా.. ఇప్పటి వరకు వాటి గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ..
మత్స్య ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన ఫిషరీస్ ఇన్సెంటీవ్స్ రైతులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నానన్నారు. 50 సంవత్సరాల ఇన్ట్రస్ట్ ఫ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ రాష్ట్రానికి ఎంత కేటాయిస్తారో ఇంకా కేంద్రం సమాచారం ఇవ్వాల్సి ఉందన్నారు. కొన్ని మంచి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించినప్పటికీ.. విభజన చట్టంలోని హామీల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిరాశే మిగిల్చిందన్నారు.
ఇటీవల విశాఖలో జరిగిన సమావేశంలో సాక్షాత్తు ప్రధానమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారని, బడ్జెట్లో స్పెషల్ క్యాటగిరి స్టేటస్పై ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు కావొస్తున్నా.. బడ్జెట్లో విభజన చట్టంలోని హామీల గురించి ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. పోలవరం నిధులపై, ప్రత్యేక హోదాపై, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధుల పెండింగ్, ఆర్థిక లోటుపై, రైల్వే కారిడార్, స్టీల్ ఫ్యాక్టరీపై చేస్తామన్న సాయంపై బడ్జెట్లో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. విభజన హామీలపై బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తామని, కచ్చితంగా ఈ అంశాలన్నీ లేవనెత్తి, రాష్ట్రానికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.