డాక్టర్‌ సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలనను ప్రతి గడపకూ తీసుకెళ్లాలి

వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలతో సజ్జల రామకృష్ణారెడ్డి 

బద్వేల్‌లో వైయస్‌ఆర్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశం

వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి.. బద్వేల్‌ ఉప ఎన్నికలో డాక్టర్‌ సుధను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బద్వేల్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ సీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బద్వేల్‌ ఉప ఎన్నిక వైయస్‌ఆర్‌ సీపీ ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అభ్యర్థి డాక్టర్‌ సుధ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పేదల జీవితాలు మెరుగుపడాలని, పేదరికం నుంచి బయటపడాలని, రాష్ట్రంలోని పేద కుటుంబాలు బంగారు భవిష్యత్తులోకి వెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సంక్షేమమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారన్నారు. రాజకీయం అంటే ఎన్నికల సమయంలోనే  ఆర్భాటాలు చేయడం గతంలో చూశాం.. కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మేనిఫెస్టోలోని హామీలనే కాకుండా.. మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. 

పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను సీఎం వైయస్‌ జగన్‌ పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం పదవులు, పనుల్లో రిజర్వేషన్‌ కేటాయించారన్నారు. ఇవన్నీ గతంలో జరగలేదు. ప్రతి లబ్ధిదారుకు నేరుగా ప్రభుత్వ సాయం అందుతుందన్నారు. వలంటీర్, సచివాలయాల వ్యవస్థ ద్వారా గుమ్మం వరకు పరిపాలనను తీసుకువచ్చారన్నారు. నాడు – నేడుతో విద్యా, వైద్య రంగాలను మార్చేశారని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా రూపుదిద్దారని చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని, వాస్తవంగా ఏం జరుగుతుందో ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సజ్జల సూచించారు. గతంలో వైయస్‌ఆర్‌ జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఉండేది కాదని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టులన్నీ నిండు కుండలా కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని, ఈ నెల రోజుల్లో బద్వేల్‌ నియోజకవర్గంలోని ప్రతి గడపకూ  రెండు, మూడు సార్లు వెళ్లాలన్నారు. ఈ ఉప ఎన్నికలో పోలింగ్‌ శాతం విపరీతంగా పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. 
 

Back to Top