కర్నూలు: దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం చీకటి జీవోను తీసుకొచ్చిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎండోమెంట్ ల్యాండ్స్ టీడీపీ నేతలకు ధారాదత్తం చేస్తున్నారని, సనాతన ధర్మం కాపాడే పవన్ కల్యాన్ ఎక్కడున్నాడో తెలియడం లేదన్నారు. దేవుడి మాన్యం భూముల లీజ్ వ్యవహారంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు శుక్రవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం జోక్యాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎండోమెంట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. దీనిపై ప్రతి ఒక్కరూ స్పందించాలి. పప్పు, బెల్లం మాదిరిగా దేవాలయా భూములను పంచుకుంటే తాము చూస్తూ ఊరుకోం. క్యాబినెట్ లో ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలి. దేవాలయం భూముల లీజ్, జీవోలపై కూటమి ప్రభుత్వం లో భాగస్వామ్యం అయిన బీజేపీ, జనసేన పార్టీ నేతలు స్పందించాలి. దేవుడికి ద్రోహం చేసేందుకు చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్నాం న్యాయపోరాటం చేస్తాం. ప్రజలకు హామీలు అమలు చేయాలి, ఎన్టీఆర్ రామారావు ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచి మోసం చేస్తున్నారు. మహానాడులో వైయస్ జగన్ పై విమర్శలకు పరిమితమయ్యారు. సూపర్ సిక్స్ హామీల ఊసే లేదు, ప్రభుత్వ భూములు అస్మదీయులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. ఎండోమెంట్ ల్యాండ్స్ టిడిపి నేతలకు ధారాదత్తం చేస్తున్నారు. సనాతన ధర్మం కాపాడే పవన్ కల్యాన్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. హిందూ దేవాలయ భూములు కొట్టేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు..? హిందూ ధార్మిక సంఘాలు అన్ని భూముల పరిరక్షణకు ముందుకు రావాలి. దేవాదాయ భూముల పరిరక్షణకు వైయస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంది. దేవాదాయ భూముల సవరణ బిల్లును పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలి. న్యాయ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నాము, ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహిస్తాం` అని ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చరించారు.