తాడేపల్లి: దీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగుతూ ప్రజలకు సేవలందించిన గాదె వెంకటరెడ్డి గారి మరణం రాజకీయ రంగానికి తీరని లోటని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని, ప్రజల సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డితో గాదె వెంకటరెడ్డి గారికి ఎంతో సన్నిహిత అనుబంధం ఉందని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు. వైయస్ఆర్ తో కలిసి ప్రజా సమస్యలపై పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గాదె వెంకటరెడ్డి గారి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.