అమరావతి: కొండవీడులో బీసీ రైతు కోటయ్యను చంద్రబాబే చంపేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కోటయ్య మృతి పట్ల ప్రతిపక్ష నేత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబు హెలికాప్టర్ దిగడానికి కోటయ్య బొప్పాయి పొలాన్ని నాశనం చేశారని, కొన ఊపిరితో ఉన్న రైతును అక్కడే వదిలేశారని తెలిపారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటని వైయస్ జగన్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు చేసిన ఓవరాక్షన్కు కోటయ్య బలయ్యాడు. కొండవీడు ఉత్సవాలకు సోమవారం సీఎం చంద్రబాబునాయుడు హాజరు కాగా.. వాహనాల పార్కింగ్ కోసం పోలీసులు బలవంతగా కోటయ్య అనే రైతు పంట భూమిని లాక్కొన్నారు. సీఎం వాహనాల పార్కింగ్ కోసం పంటను ధ్వంసం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను పోలీసులు ధ్వంసం చేయడంతో రైతు కోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కొద్దిసేపటికే కోటయ్య అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు కొట్టడం వల్లే కోటయ్య మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.