అనంతపురం: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్పై అసత్య కథనాలు ప్రచురించడాన్ని నిరసిస్తూ అనంతపురంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలను దహనం చేస్తూ నిరసనకు దిగిన మహిళలు, ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రుద్రంపేట ఏ4 ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ విజయకుమారి పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ, వైయస్ జగన్ ప్రతిపాదనలను రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని విమర్శించారు. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ఆరోపిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలను ఖండించారు. మహిళలు శాంతియుతంగా నిరసన తెలుపుతూ, వాస్తవాలను ప్రతిబింబించే విధంగా మీడియా వ్యవహరించాలని కోరారు.