విజయవాడ: దిశ చట్టంతో మహిళల భద్రత పెరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు పూర్తిభద్రత, స్వేచ్ఛ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కల్పించారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో గృహహింస, భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగాయనేది అవాస్తవమని, పోలీస్ డిపార్టుమెంట్తో వివరాలు చర్చించిన తరువాతే ఈ మాట చెప్పగలుగుతున్నానన్నారు. వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్లో ఆంధ్రప్రదేశ్లో గృహహింస పెరగకపోవడానికి దశలవారి మద్యపాన నిషేధం పథకమే ప్రధాన కారణమన్నారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నా, చితక కేసులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించామన్నారు. ఏపీలో కఠిన నియంత్రణతో మద్యపానాన్ని తగ్గిస్తున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే 43 వేల బెల్టుషాపులపై వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, పర్మిట్రూమ్లను రద్దు చేసిందన్నారు. అదే విధంగా 33 శాతం మద్యం షాపులను, బార్ల సంఖ్య కూడా ప్రభుత్వం తగ్గించిందన్నారు. మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టం తీసుకువచ్చారని, దిశ చట్టం కింద కేసు నమోదుకు తప్పించుకునే అవకాశం కూడా లేదన్నారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని, గ్రామ వలంటీర్లకు మహిళల బాధలు చెప్పుకునే అవకాశం ఉందన్నారు. మహిళల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. మహిళా భద్రత కోసమే ప్రభుత్వం ఉందని సీఎం వైయస్ జగన్ పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రతి కుటుంబంలోని మహిళలకు అన్నగా అండగా నిలిచారన్నారు.