రాజంపేట: వైయస్ఆర్ జిల్లాలోని రాజంపేట జీఎంసీ కళ్యాణ మండపంలో వైయస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సమావేశానికి తరలివచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై నాయకులు, పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీని ఘన విజయం సాధించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆరు మండలాల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి ప్రతి స్థానంలో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలతో నిరంతరం మమేకమవుతూ స్థానిక సమస్యలపై పోరాడాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీని గెలిపించుకుని ఆ విజయాన్ని వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కానుకగా అందిస్తామని పార్టీ శ్రేణులు వెల్లడించారు. రాజంపేట నియోజకవర్గంలో పార్టీకి ఉన్న బలాన్ని మరింత పెంచుకుని, స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. గొల్లపల్లిలో నూతన ఉర్దూ పాఠశాల భవనం ప్రారంభం నందలూరు మండలం గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఉర్దూ పాఠశాల భవనాన్ని అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి, ఎంపీపీ భాస్కర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రావడంతో విద్యాభ్యాసానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడింది.