తాడేపల్లి: టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి రెండేళ్లుగా అప్పన్న అకౌంట్లో రూ.25 వేల చొప్పున జమ చేస్తూ, అప్పన్నతో సంబంధమే లేదని ఎంపీ చెప్పడం విడ్డూరంగా ఉందని, ఏ సంబంధం లేకపోతే ఇంతకాలం డబ్బులిస్తారా అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 మార్చి నుంచి 2025 మార్చి వరకు కూడా, ప్రతి నెలా ఒకటి లేదా రెండు తేదీల్లో ఠంచన్గా ఎంపీ వేమిరెడ్డి మైనింగ్ కంపెనీ నుంచి నెఫ్ట్ ద్వారా నగదు చేయడంపై టీడీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. వైయస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పడంతోనే సాయం చేశానని చెబుతున్న వేమిరెడ్డి, పార్టీ మారి టీడీపీ నుంచి దంపతులిద్దరూ ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడాదిన్నర వరకు కూడా ప్రతినెలా సాయం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రెస్మీట్లో పుత్తా శివశంకర్రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: జగన్గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే..: జగన్గారు ప్రెస్మీట్లో లేవనెత్తిన ఏ ఒక్క అంశానికీ టీడీపీ నాయకుల నుంచి సమాధానం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి విషయమూ స్పష్టమైన ఆధారాలతో మాట్లాడారు కాబట్టి. అప్పన్న అనే వ్యక్తి వైవీ సుబ్బారెడ్డిగారి పీఏ కాదని, అతడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) పీఏ అని జగన్ గారు చెప్పిన విషయాన్ని మాత్రమే తీసుకుని ఆ ఎంపీతో మాట్లాడించారు. సుబ్బారెడ్డిగారు చెప్పడం వల్లనే అప్పన్నకి ఆర్థిక సహాయం చేశానని వీపీఆర్గారు చెప్పుకొచ్చారు. ఒకవేళ అదే నిజమైతే.. ఆ చేసే సహాయం ఒకేసారి కాకుండా, ప్రతి నెలా 1 లేదా 2వ తేదీన అలా ఖాతాలోకి ఒకే ఎమౌంట్ రూ.25 వేల చొప్పున బదిలీ చేస్తారా? (అంటూ అప్పన్న బ్యాంక్ ఎక్కౌంట్ స్టేట్మెంట్ మీడియాకు చూపారు) వీపీఆర్గారు పార్టీ మారి, టీడీపీ నుంచి గెల్చిన తర్వాత కూడా దాదాపు ఏడాదిపాటు, ప్రతి నెలా నగదు బదిలీ చేశారు. ఎవరైనా అలా చేస్తారా? ఏది మాట్లాడిన తమ అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది కాబట్టి.. ప్రజలు కూడా నమ్ముతారని భావించి, ఇలా ఇష్టానుసారం అబద్ధాలు చెప్పడం ధర్మమా?. వైయస్ఆర్సీపీ మీద బురద జల్లే కుట్ర: రాష్ట్రంలో ఎక్కడ, ఏం జరిగినా, ఎవరు నేరం చేసినా.. దాన్ని వైయస్ఆర్సీపీకి అంటగట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం సిగ్గుచేటు. అప్పన్న అనే వాడు వేమిరెడ్డి పీఏ అని ధృవీకరించే విధంగా కళ్ల ముందు ఆధారాలు కనిపిస్తున్నా.. ఇంకా ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేయాలను కోవడం అవివేకం. చంద్రబాబు మోసాలను ప్రజలు గ్రహించారు. ఆయన ఆటలు సాగడం లేదు కాబట్టే.. తమ పార్టీపైనా, తమ పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తూ, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పుత్తా శివశంకర్రెడ్డి ఆక్షేపించారు.