విశాఖపట్నం: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ పేరుతో వందల కోట్లు చేతులు మారాయని, రూ. 10 కోట్లు నెట్వర్త్ కూడా లేని సంస్థకు వందల కోట్ల విలువైన భూములు కేటాయించడం అనుమానాలకు తావిస్తోందని విశాఖ దక్షిణ నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాలంటే చంద్రబాబుకి ఎప్పుడూ చిన్నచూపేనని మండిపడ్డారు. ప్రతి ఎన్నికలకు మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హమీ ఇవ్వడమే తప్ప వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. మత్స్యకారుల సంక్షేమం కోసం వైయస్ జగన్ గారు ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే చంద్రబాబు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని, తక్షణం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్ గారుయ ముఖ్యమంత్రి అయ్యాకనే మత్స్యకారుల కష్టాలకు జీవితంపై భరోసా వచ్చిందని, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - ప్రతి మేనిఫెస్టోలో ఎస్టీల్లో చేరుస్తానని హామీ ఇస్తాడు మత్స్యకారులంటే సీఎం చంద్రబాబుకి ఎంత చిన్నచూపో ఆయన్ను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, ఆ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా నాకు బాగా తెలుసు. మత్స్యకారులను ఓటు బ్యాంకుగా చూస్తాడు తప్పితే మా అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత చూస్తే ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలోనూ మత్స్యకారలును ఎస్టీల జాబితాలో చేరుస్తానని హామీ ఇస్తాడు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఇంతవరకు ఆ హామీని మాత్రం నెరవేర్చలేదు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తానని చెప్పడమే కానీ అధికారంలోకి వచ్చాక దాని గురించి పట్టించుకున్నపాపాన పోవడం లేదు. మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఆయనకు ఇష్టముండదు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్నాడు. వీటిలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మత్స్యకారులకు ఆయన చేసింది శూన్యం. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు మత్స్సకారుల వలసలు నిర్మూలించేలా, మావాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కనీసం ఒక్క ఫిషింగ్ హార్బర్ కానీ, జెట్టీ కానీ నిర్మించలేని దద్దమ్మ చంద్రబాబు. ఎస్టీల్లో కలుపుతామని అన్నారు కదా అని చంద్రబాబుని అడిగితే తోలుతీస్తా, తాటతీస్తా, ఖబడ్దార్ అని మా మత్స్యకార సోదరుల మీద చంద్రబాబు కన్నెర్ర జేశాడు. - బోట్లు మునిగిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వలేదు గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి కోసం రూ. 15 కోట్లు కేటాయించాలని కోరితే తిప్పించుకున్నాడే కానీ నన్ను అస్సలు పట్టించుకోలేదు. ఇదే సమస్యను సీఎంగా ఉండగా వైయస్ జగన్ గారికి వివరిస్తే ఏకంగా రూ.155 కోట్లు కేటాయించి ఫిషింగ్ హార్బర్లో అన్ని అత్యాధునిక వసతులు సమకూర్చారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్ హామీ నెరవేర్చాలని ఎన్నోసార్లు చంద్రబాబుని టీడీఎల్పీ మీటింగ్లో, అసెంబ్లీలో నిలదీసినా ఆయన పట్టించుకోలేదు. నేను గట్టిగా డిమాండ్ చేస్తుంటే రూ.150 కోట్లు ఎక్కడి నుంచి తేవాలని అచ్చెన్నాయుడు అడ్డుకునేవాడు. ఇదే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణం చేసి రూ. 150 కోట్లు ఒక్కడే దర్జాగా మెక్కేశాడు. కానీ మత్స్యకారులకు పింఛన్ ఇవ్వడానికి మాత్రం వీరికి మనసు రావడం లేదు. ఆయన చేసిన కుంభకోణంతో ఏకంగా ఒక ఫిషింగ్ హార్బర్ కట్టేయొచ్చు. గతంలో బోట్లు మునిగి పోయినప్పుడు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయలేదనే కారణంతో 50 బోట్లకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టిన నీచుడు చంద్రబాబు. ఎన్నోసార్లు దాని గురించి అడిగితే పట్టించుకున్న పాపాన పోలేదు. వైయస్ జగన్ గారు సీఎం కాగానే ఒక్కో బోటుకి రూ. 6 లక్షలిచ్చి మత్స్యకారులను ఆదుకున్నారు. ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం జరిగితే గంటల్లో నష్టపరిహారం చెల్లించి ఆదుకున్నారు. వైయస్ జగన్ గారికి మత్స్యకారుల కష్టాలు తెలుసు కాబట్టే అండగా నిలిచి ఆదుకున్నారు. - వైయస్ జగన్ రాకతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు చేపల వేటకోసం కుటుంబాలను వదిలేసి వలస వెళ్లి ప్రాణాలు కోల్పోవడం, విదేశీ జైళ్లలో బందీలు అవుతున్న మత్స్యకారుల దుస్థితిని చూసి వైయస్ జగన్ గారు చలించిపోయారు. ఈ పరిస్థితిని మార్చడానికి రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతంలో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా శ్రీకారం చుట్టారు. దాదాపు రూ. 300 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లాలో జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేసి ఎన్నికలకు ముందు ప్రారంభించారు. దానికోసం 79 ఎకరాల భూమి కేటాయించారు. 1250మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేలా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేశారు. 50 శాతం సబ్సిడీతో ఆ బోట్లకు సుమారు 20 వేల మత్స్యకార కుటుంబాలను యజమానులుగా చేసే ప్రణాళిక చేశారు. ప్రధాని మోడీ మహారాష్ట్ర నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను వర్చువల్గా ప్రారంభించారు. కానీ కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక, అందులోకి మత్స్యకారులు ప్రవేశించకుండా ఫిషింగ్ హార్బర్ను మూసేసింది. దానికి కేటాయించిన భూమిలో సగం సాగర్ డిఫెన్స్ అకాడమీకి కేటాయించి మత్స్యకారుల కడుపుకొట్టారు. డిఫెన్స్ అకాడమీకి భూములు కేటాయించాలనుకుంటే కృష్ణపట్నం పోర్టు సమీపంలో కేటాయించి ఉండోచ్చు. కానీ మత్స్యకారుల కడుపుకొట్టడం దుర్మార్గం. చంద్రబాబుకి చేతనైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగరమాల ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలి. అంతేకానీ, వైయస్ జగన్ గారు సృష్టించిన సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం ఆమోదయోగ్యం ఎంతమాత్రం కాదు. దీన్ని మత్స్యకారులు ఎవరూ హర్షించరు. - మత్స్యకారుల అభివృద్ధి కోసం జగన్ తపించారు రూ. 40 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిన సాగర్ డిఫెన్స్కి రూ. 200 కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చేస్తున్నాడంటే అందులో చంద్రబాబు ఎంత కమీషన్ తీసుకుంటున్నాడో అర్ధమవుతుంది. దాదాపు రూ. 125 కోట్లతో నిర్మించిన డాక్ ఏరియాను మొత్తం సాగర్ డిఫెన్స్కి కేటాయించాడు. 2029లో మళ్లీ వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాగర్ డిఫెన్స్ నుంచి ఆ భూములను వెనక్కి తీసుకుంటామని వైయస్ జగన్ గారు స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిషింగ్ హర్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల రూపంలో మత్స్యకారుల కోసం సృష్టించిన ఆస్తిని వారికే కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్లు నిర్మించి మత్స్యకారులను ప్రోత్సహిస్తే అంతర్జాతీయ మార్కెటింగ్తో కోటీశ్వరులవుతారు. అందుకే మత్స్యకారుల కోసం వైయస్ జగన్ గారు తపించారు. - జానకీరామ్, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ మాజీ బోర్డు మెంబర్ కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులను గంగమ్మకి దూరం చేయాలనే కుట్ర జరుగుతోంది. రూ.10 కోట్లు కూడా నెట్వర్త్ లేని సాగర్ డిఫెన్స్ కంపెనీకి రూ. 300 కోట్లతో మత్స్యకారుల సంక్షేమం కోసం నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ఇచ్చేయడం దుర్మార్గం. 2023లో లక్ష రూపాయలతో సాగర్ షిప్ రిపేర్స్ అండ్ మెరైన్ సర్వీసెస్ అనే సూట్ కేస్ కంపెనీ ఏర్పాటు చేశారు. రూ. 10 కోట్లు నెట్వర్త్ లేని కంపెనీ రూ. 2500 కోట్ల వ్యాపారం చేస్తుందని మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక విశాఖ పట్నం ఫిషింగ్ హార్బర్లో కూడా పనులు పూర్తిగా నిలిపేశారు. మత్స్యకారుల కోసం కేటాయించిన నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారు. ప్రాణాలకు తెగించి తమిళనాడు మెకనైజ్డ్ బోట్లను పట్టుకుంటే నారా లోకేష్ ఆదేశాలతో విడిపించడం దుర్మార్గం. డీజిట్ రేట్ పెరుగుదలకు అనుగుణంగా సబ్సిడీ కూడా పెంచాలి. మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ తో పాటు వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ మాజీ బోర్డు మెంబర్ జానకీరామ్, వైయస్ఆర్సీపీ పబ్లిసిటీ వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పరవాడ ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.