తాడేపల్లి: మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావడం కోసం చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ చిత్తశుద్దితో ప్రయత్నించలేదని, ఓటింగ్ కి ముందు రేవంత్ రెడ్డితో ఆ పార్టీ మహిళా నాయకులు, ఆర్థిక మంత్రి పయ్యావుల వంటి వారు కలవడంపై వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ లో బిల్లు వీగిపోయిన తర్వాత కూడా రాష్ట్ర బీజేపీ, టీడీపీ ఎంపీలు రేవంత్రెడ్డితో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు పాల్గొనడం ద్వారా రాష్ట్ర పరువును ఢిల్లీలో తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢిల్లీలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఏపీలో ర్యాలీ పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి అనైతిక బంధాన్ని చూసి ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు పదే పదే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడని, కాంగ్రెస్లో ఉండి చంద్రబాబు కోసం పనిచేసే రేవంత్కి వైయస్ జగన్ పేరెత్తే అర్హత లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలనతో దేశంలో గుర్తింపు తెచ్చుకున్న గొప్ప నాయకుడు వైయస్ జగన్ అని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఆయన తెచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... జగన్ ని విమర్శించే అర్హత రేవంత్రెడ్డికి ఏముంది? - పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించి వీగిపోయేలా చేసిన ప్రతిపక్ష పార్టీల కుట్రలను వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. దేశంలో ఇప్పుడు 33 శాతం రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తున్నా వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య 50 శాతం రిజర్వేషన్లు అమలు కోసం చట్టం చేయడంతోపాటు అమలు చేసి చూపించిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. అలాంటిది వైయస్ జగన్ గారి పాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ పేరుతో విమర్శలు చేశారని బ్రేకింగ్లు పేరుతో కొన్ని మీడియా ఛానెళ్లు ప్రసారం చేశాయి. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో వైయస్ జగన్ పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి తెలుసుకోలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడని అర్థమవుతోంది. మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్ ఖురాన్ గా భావించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించిన ఘనత జగన్కి తప్ప దేశంలో మరే ముఖ్యమంత్రికీ దక్కదు. మహిళలకు ఇళ్లపట్టాలు, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ వంటి హామీలు అమలు చేసి మహిళలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఎంపీపీలు వంటి కీలక పోస్టుల్లో మహిళలకు 50 శాతం అవకాశం కల్పించి రాజకీయంగా ప్రోత్సహించారు. ఎవరి అండ లేకుండా సొంతంగా పార్టీ పెట్టి ప్రజల మద్ధతుతో సొంతంగా పార్టీ పెట్టి 151 సీట్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వైయస్ జగన్ గారిని విమర్శించే నైతిక అర్హత రేవంత్రెడ్డికి ఏముంది? రేవంత్ రెడ్డితో టీడీపీ నాయకులు ఎందుకు సంప్రదింపులు జరిపారు? వైయస్ జగన్ గారు నిరంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించారే తప్ప ఇతర రాష్ట్రాలు లేదా కేంద్ర రాజకీయాల్లో ఏనాడూ తలదూర్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఏపీని దేశంలో మొదటిస్థానంలో నిలపడమే ధ్యేయంగా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా శ్రమించారు. ఏ నాయకుడిని వ్యక్తిగతంగానో రాజకీయంగానో విమర్శించలేదు. చంద్రబాబు ప్రయోజనాల కోసం డబ్బు సంచులతో వెళ్లి ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్కయిన రేవంత్రెడ్డికి వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. చంద్రబాబు చలవ వల్లనే పార్టీ మారగానే తెలంగాణ పీసీపీ అధ్యక్షుడిగా రేవంత్ని నియమించారని, పార్టీ గెలవగానే రాహుల్ గాంధీతో మాట్లాడి చంద్రబాబు ఆయన్ను ముఖ్యమంత్రిని చేశాడని కాంగ్రెస్ నాయకులే చెబుతుంటారు. అందుకే కాంగ్రెస్లో పార్టీలో ఉండి కూడా చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి పాలన సాగుతోందని అంటున్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన టీడీపీ మహిళా నాయకులు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర టీడీపీ నాయకులు బిల్లును వ్యతిరేకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫొటోలు తీసుకుని మురిసిపోయారు. పార్లమెంట్లో బిల్లు వీగిపోయిన మర్నాడు పొద్దున్నే కూడా ఏపీ, తెలంగాణకు చెందిన టీడీపీ, బీజేపీ నాయకులతో రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఏకంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో బిల్లును వ్యతిరేకించిన యూపీఏకి వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తూ, ఢిల్లీలో మహిళా బిల్లును వ్యతిరేకించిన రేవంత్ రెడ్డితో ఎలా సంప్రదింపులు జరుపుకొంటారు? ఇది రాష్ట్రం పరువు తీయడం కాదా? చంద్రబాబు సూచనలతోనే షర్మిలకి పీసీసీ పదవి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబుల అనుబంధం మహిళా బిల్లు సందర్భంగా మరోసారి బట్టబయలైంది. ఇవన్నీ చూస్తుంటే మహిళా బిల్లుపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ది ఏమిటో స్పష్టంగా అర్థమైపోతుంది. గతంలోనూ తాను చెప్పడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ పనులను ఆపేశాడని తెలంగాణ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పాడు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబుతో ఇంత దృఢమైన బంధం కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి.. వైయస్ జగన్ గారి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. చివరికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం కూడా చంద్రబాబు సూచనలతోనే జరిగిందన్నది ఓపెన్ సీక్రెట్. కాబట్టే చంద్రబాబుకి ఏ చిన్న కష్టమొచ్చిన ఆమె మీడియా ముందుకొచ్చి వైయస్ జగన్ గారిని విమర్శిస్తారు. అధికారంలో ఉన్న చంద్రబాబు అసమర్థతను ప్రజలకు తెలియకూడదని నిరంతరం తాపత్రయ పడుతుంటారు. రెండేళ్లుగా ఆమె చంద్రబాబు కోసం ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ మీద పోరాడుతోంది. పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో టచ్లో ఉండే చంద్రబాబు రాజకీయ బంధాలు, అనుబంధాలను ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. పాలన చేతకాక బూతులతో డైవర్షన్ రాజకీయం అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆయన అవినీతిని ఆధారాలతో ఎత్తి చూపుతున్న వైయస్ జగన్ గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రైతులు పండించిన పంటలకు మద్ధతు ధర ఇవ్వడం చేతకాక వైయస్ జగన్ గారిని టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు తలెత్తినప్పుడల్లా తల్లి చెల్లి, గొడ్డలి పార్టీ అంటూ జగన్ గారిని తిట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబుకి తెలిసిన రాజకీయం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమైన చంద్రబాబు, గొడ్డలి.. గొడ్డలి అంటూ వికృత రాజకీయాలు చేస్తున్నాడు. అన్న క్యాంటీన్లు ఎత్తేశారని బుదరజల్లుతున్న చంద్రబాబు, వాటి నిర్మాణం పేరుతో చేసిన దోపిడీ గురించి ఆధారాలు చూపిస్తే వాటికి సమాధానం చెప్పడం లేదు. దేశానికి వెన్నుపోటు రాజకీయాలను నేర్పిందే చంద్రబాబు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే దమ్ము లేదు. శాంతిభద్రతల పరిరక్షణలో చంద్రబాబు ఫెయిలైపోయాడు. సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలుపై దృష్టిసారించకుండా నిత్యం జగన్ నామ స్మరణ చేసి బూతులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబుని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా చంద్రబాబుకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.