తాడేపల్లి: మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం బోర్డు చైర్పర్సన్గా తొలగించబడిన సంచయితకు మహిళా కమిషన్ బాసటగా నిలిచింది. ఆమె తరఫున న్యాయ పోరాటం చేస్తామని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తిరోగమన పురుషస్వామ్య ఆలోచన ధోరణి కలిగిన తెలుగుదేశం పార్టీ సంచయితను మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం బోర్డు నుంచి తప్పించడంపై సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. మహిళా సాధికారత కోసం,వారి ఉజ్వల భవిష్యత్తు కోసం గడచిన రెండేళ్లుగా ఎన్నో పురోభివృద్ధి చర్యలు చేపట్టి అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనా ధోరణులకు టీడీపీ వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. మహిళలకు వారసత్వంగా ఆస్తిలో వాటాలే కాకుండా హోదా, ఉద్యోగ అవకాశాలు, ఆలయాల ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలకు నేతృత్వం వహించడంలో కూడా సమాన హక్కులు కల్పిస్తూ, గతంలో దేశంలో ఎన్నో కోర్టులతో పాటు, సుప్రీంకోర్టు కూడా చరిత్రాత్మక తీర్పులు ఇచ్చినప్పటికీ, లింగ వివక్ష, మహిళా వ్యతిరేక విధానాలను సమర్థించే విధంగా ఉన్న పురాతన ఆలోచనలు, ఆనాటి ఆచార వ్యవహారాల ధోరణి ఇప్పుడు కూడా కొనసాగిస్తుండడం, ఆ తీర్పులకు తాత్కాలికంగా విఘాతం కలిగించినట్లు అయింది. మేము రాష్ట్ర మహిళలందరం ప్రభుత్వానికి బాసటగా నిలుస్తాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్పర్సన్కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. రాష్ట్రంలో మహిళలు పురుషులకు ఏ మాత్రం తీసిపోరన్న విషయాన్ని స్పష్టంగా చూపేందుకు ఈ కేసు ఒక మైలురాయిలా నిలుస్తుందని వాసిరెడ్డి సీఎం వైయస్ జగన్ను కోరారు.