బాపట్ల జిల్లా: రైతులకు సాగునీరందించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు చేపట్టిన నిరాహారదీక్ష ఆసుపత్రిలోనే కొనసాగుతోంది. సోమవారం తన దీక్షను కొనసాగిస్తున్నారు. నాలుగు రోజులుగా దీక్ష చేపడుతున్నా కూటమి ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లావ్యాప్తంగా ఉన్న పంట కాల్వల పరిస్థితిని ఎత్తిచూపి ఇప్పటికే కాలువలకు నీరు విడుదల అయినందున తక్షణం అన్ని ప్రాంతాల్లోనూ పూడికతీత పనులు చేపట్టాలని వరికూటి అశోక్బాబు ఈ నెల 1వ తేదీ నుంచి నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. బాపట్లలోని రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. పనులు చేసి లేదా చేస్తామని హామీ ఇచ్చి, తక్షణం పనులు మొదలుపెట్టి దీక్ష విరమింప చేయాలే తప్ప అవేమీ చేయకుండా పోలీసులు వచ్చి అశోక్బాబును చుట్టుముట్టి బలవంతంగా ఎత్తుకెళ్లి పిడిగుద్దులతో కుళ్లపొడిచి సృహతప్పి పడిపోయేలా దాడి చేశారు. పార్టీలకతీతంగా రైతులకు న్యాయం చేయమని అడిగితే పోలీసులను పెట్టి కొట్టించడంపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. పార్టీలకతీతంగా అన్నదాతలు కొందరు ప్రత్యక్షంగా మరికొందరు పరోక్షంగా వరికూటికి మద్దతుగా నిలుస్తున్నారు. వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అశోక్బాబును ఫోన్లో పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అశోక్బాబుపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. అలాగే పార్టీ ముఖ్య నేతలు కూడా అశోక్బాబుపై దాడిని ఖండించారు. క్షిణిస్తున్న ఆరోగ్యం అసలే పోలీసుల దాడితో అస్వస్థతకు గురైన అశోక్బాబు ..ఆసుపత్రిలో చేరి ప్రాణాలను లెక్క చేయకుండా తన దీక్షను కొనసాగిస్తున్నారు. రైతుల కోసం పచ్చి మంచి నీరు కూడా తీసుకోవడం లేదు. అశోక్ బాబు ఆరోగ్యం క్షీణిస్తుంది, షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ పడిపోతున్నాయని కుటుంబ సభ్యులు, వైయస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా నాయకుడికి ఏదైనా జరిగితే దేనికైనా వెనుకాడబోమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబును వైయస్ఆర్సీపీ నేతలు పరామర్శిస్తున్నారు. మొదటి రోజు మాజీ మంత్రి పేర్ని నాని, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించగా , ప్రతి రోజు పార్టీ ముఖ్య నాయకులు ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఆదివారం మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా వెళ్లి ఆయన్ను పరామర్శించారు. రైతుల పక్షాన మాట్లాడడమే ఆయన చేసిన తప్పా అని అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అశోక్బాబుకు ఏదైనా జరిగితే అందుకు చంద్రబాబు, లోకేష్లు బాధ్యత వహించాలని హెచ్చరించారు.