టీటీడీ మొబైల్ యాప్‌ ప్రారంభించిన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

ఈ యాప్‌లో తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం 

యాప్ ద్వారా శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుకింగ్  

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మొబైల్‌ యాప్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. జియో సహకారంతో రూపొందించిన నూతన టీటీడీ యాప్‌ను ఈవో ధర్మారెడ్డితో కలిసి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా భక్తులకు వన్‌స్టాప్‌ విధానంలో సేవలు అందిస్తామని చెప్పారు. వర్చువల్‌ సేవలను భక్తులు ఈ యాప్‌ ద్వారా వీక్షించవచ్చని వివరించారు. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ యాప్‌ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చన్నారు. 

భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా శ్రీటీటీదేవస్థానం పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను ప్రారంభించిన అనంత‌రం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్‌ యాప్‌ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్‌ నుంచి అందించవచ్చని చెప్పారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా ఈ యాప్‌ ద్వారా చూడవచ్చని తెలిపారు.

తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉందని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్‌లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని తెలిపారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోగలుగుతున్నారని వివరించారు. నూతన యాప్‌ సేవలపై భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని పొందుపరుస్తామని చెప్పారు.

భక్తులకు డిజిటల్‌ గేట్ వే: టీటీడీ ఈవో 
భక్తులకు సంబంధించిన అన్ని అవసరాల కోసం డిజిటల్‌ గేట్‌ వేగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. భక్తులు లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ నేమ్‌తోపాటు ఓటీపీ ఎంటర్‌ చేస్తే చాలని, పాస్‌వర్డ్‌ అవసరం లేదని చెప్పారు. కంప్యూటర్‌ వాడటం తెలియనివారు కూడా వినియోగించేందుకు వీలుగా ఈ ప్రపంచస్థాయి యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిషోర్‌, జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనీష్‌ షా, ఐటీ సలహాదారు అమర్‌, ఐటీ జిఎం సందీప్‌, యాప్‌ను రూపొందించిన బృందం పాల్గొన్నారు.

Back to Top