‘ఉపాధి కూలీ మరణానికి కూడా విలువ ఇవ్వరా..?’ 

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్‌మోహ‌న్ రావు  ఫైర్‌

తాడేపల్లి: ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక ఉపాధి కూలీ పురుగులు మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంటే..క‌నీసం ఆమె మ‌ర‌ణానికి కూడా విలువ  ఇవ్వ‌రా అని  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్‌మోహ‌న్ రావు మండిప‌డ్డారు.  కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.  ప్రస్తుత ఏపీ ప్రభుత్వం.. ఉపాధి హామీ పనులను పూర్తిగా తగ్గించేశారని విమర్శించారు.  మంగ‌ళ‌వారం తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ చందర్లపాడు లో ఉపాధి హామీ కూలి చేసే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక పురుగులు మందు తాగింది. రూ. 300 కూలి కొడుకు చదువుకు ఉపయోగపడుతుంది అని  పనికి వెళితే వేధించారు. 

ఆమె మాట్లాడిన వీడియో ఉన్నా... అనుమానాస్పద మృతి గా కేసు కట్టడం దారుణం. ఆమె భర్త చేత కడుపు నొప్పి అని ఫిర్యాదు చేయించడం బాధాకరం. కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా..?,  ఆమె మరణ వాంగ్మూలంకి విలువ లేదా?,  ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను ప్రశ్నించినందుకు ఆమె ను వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనుల్లో ఇలానే అక్రమాలు జరుగుతున్నాయి.  టీడీపీ నేతల ప్రమేయంతో అక్రమాలకు పాల్పడుతున్నారు. 

ఇంత ఘోరంగా వేధించి చంపేస్తే కేసును తారుమారు చేస్తున్నారు. గతంలో కూడా కాకినాడలో మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ ని డబ్బులు ఇమ్మని వేధించారు. ఉపాధి పనుల్లో ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఎందుకని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఉపాధి కూలీలు వైయ‌స్ఆర్‌సీపీ కి చెందినవారైతే పనులు ఇవ్వకుండా వేధిస్తున్నారు` అంటూ జ‌గ‌న్‌మోహ‌న్‌రావు ఫైర్  అయ్యారు. 
 

Back to Top