తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో మ‌రో ముంద‌డుగు

ధ‌ర్మ‌ర‌థం ఉచిత బ‌స్సుల స్థానంలో విద్యుత్ బ‌స్సులు

 ఒలెక్ట్రా కంపెని ప్ర‌తినిధుల‌తో టీటీడీ చైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి స‌మీక్ష‌

 చైర్మ‌న్ విజ్ఞ‌ప్తి మేర‌కు 10 బ‌స్సులు విరాళంగా అందించిన ఒలెక్ట్రా కంపెని

తిరుమ‌ల‌:  తిరుమ‌ల ప‌విత్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో టీటీడీ మ‌రో ముంద‌డుగు వేసింది. తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం న‌డుపుతున్న ధ‌ర్మ రథాల (ఉచిత బ‌స్సుల‌) స్థానంలో విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్ల‌కు సంబంధించి టీటీడీ చైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం ఒలెక్ట్రా కంపెని ప్ర‌తినిధులు, ఆర్‌టిసి, టీటీడీ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

      అనంత‌రం చైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు తిరుమ‌ల‌ను కాలుష్య ర‌హిత పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్ధ‌డానికి ఇప్ప‌టికే అనేక చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. ప్లాస్టిక్ బాటిళ్ళు, క‌వ‌ర్ల నిషేదం కూడా ఇందులో ఒక భాగమ‌న్నారు. తొలివిడ‌త‌గా తిరుమ‌ల‌లో ప‌నిచేసే అధికారుల‌కు విద్యుత్‌తో న‌డిచే కార్ల‌ను అంద‌జేశామ‌న్నారు. రెండ‌వ విడ‌త‌గా తిరుప‌తి, తిరుమ‌ల మ‌ధ్య విద్యుత్ బ‌స్సులు ప్ర‌వేశ పెట్టామ‌న్నారు. వీటికి భ‌క్తుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని తెలిపారు. రెండ‌వ విడ‌త‌లో తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం న‌డుపుతున్న ధ‌ర్మ‌ర‌థాల స్థానంలో విద్యుత్ బ‌స్సులు న‌డిపేందుకు 10 బ‌స్సులు విరాళంగా ఇవ్వాల‌ని ఒలెక్ట్రా కంపెని అధినేత శ్రీ కృష్ణారెడ్డిని కోరాన‌ని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు రూ.15 కోట్ల విలువ చేసే 10 విద్యుత్ బ‌స్సుల‌ను విరాళంగా అందించేందుకు ముందుకు రావ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. బ‌స్సుల డిజైనింగ్‌, నిర్వ‌హ‌ణ ఎలా ఉండాల‌నే అంశంపై చ‌ర్చించేందుకు స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. భ‌క్తుల‌కు స‌దుపాయంగా ఉండేలా బ‌స్సుల‌ను డిజైన్ చేయాల‌ని సూచించిన‌ట్లు చెప్పారు.

      మూడ‌వ ద‌శ‌లో తిరుమ‌ల‌లో తిరిగే ట్యాక్సీలు, ఇత‌ర అద్దె వాహ‌నాల స్థానంలో టీటీడీ స‌హ‌కారంతో బ్యాంకు రుణాలు ఇప్పించి విద్యుత్ వాహ‌నాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఒలెక్ట్రా కంపెని ప్ర‌తినిధులు బ‌స్సుల డిజైన్లు, నిర్వ‌హ‌ణ అంశాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి కోరిక మేర‌కు 10 విద్యుత్ బ‌స్సులు విరాళంగా అందించ‌డం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు త‌మ‌కు అందించిన గొప్ప వ‌రంగా భావిస్తున్నామ‌ని కంపెని సిఎండి శ్రీ ప్ర‌దీప్ చెప్పారు. ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ గోపినాథ్ రెడ్డి, జిల్లా ప్ర‌జా ర‌వాణా అధికారి శ్రీ చెంగ‌ల్‌రెడ్డి, టీటీడీ ర‌వాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, తిరుమ‌ల డిపో మేనేజ‌ర్ శ్రీ విశ్వ‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

విద్యుత్ బ‌స్సులో ప్ర‌యాణించిన టీటీడీ చైర్మ‌న్‌

         అనంత‌రం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నం నుండి లేపాక్షి స‌ర్కిల్ వ‌ర‌కు టీటీడీ చైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి అధికారుల‌తో క‌లిసి విద్యుత్ బ‌స్సులో ప్ర‌యాణించారు.  

Back to Top