తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నివాళులర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు కన్నబాబు, శంకర్ నారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే సుధాకర్బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదేనన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉపాధ్యాయులకు మంచిరోజులు వచ్చాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సీఎం వైయస్ జగన్ పాలన స్వర్ణయుగంగా మారిందని, పాఠశాలలను దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. విద్య, వైద్య రంగానికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారని గుర్తుచేశారు. నిరుపేద పిల్లల కోసం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలోని 95 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు సీఎం వైయస్ జగన్ పూర్వవైభవం తెచ్చారన్నారు.