వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల దాడి 

కృష్ణాజిల్లా రాజవరంలో ఘటన

అమ‌రావ‌తి: కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని రాజవరంలో వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడిచేశారు. పైగా వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలే తమపై దాడిచేశారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పరం అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాత్రి టీడీపీ పార్టీ వారు అధికంగా మైక్‌ సౌండ్‌ పెట్టారని, కొంచెం తగ్గించాలని అడిగేందుకు వెళ్లిన తమపై ఆ పార్టీ నేతలు దాడి చేశారని వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్త ఓలేటి రాహుల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీడీపీ వారి దాడిలో తనతో పాటు ఉప సర్పంచ్‌ ఓలేటి నాగేశ్వరరావు, ఓలేటి సురేష్, ఓలేటి శ్యామ్, ఓలేటి మనోజ్, బండారుపల్లి శ్రీనివాసరావులు గాయపడ్డారని పేర్కొన్నారు. బాధితులను తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సురేష్, రాహుల్, శ్రీనివాసరావును మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఇదిలా ఉండగా వైయ‌స్ఆర్‌ సీపీకి చెందిన కొందరు తమపై దాడి చేశారంటూ టీడీపీ కార్యకర్త మోదుగు గోపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో తనతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు.   

Back to Top