ఆక్వా ఉత్ప‌త్తుల నాణ్య‌త పెంచాలి

ఎస్‌ఐపీబీ స‌మావేశంలో ఉన్న‌తాధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

దేశంలో మెరైన్‌ ఎగుమతుల్లో 46శాతం మ‌న రాష్ట్రం నుంచే..

సింగిల్‌డెస్క్‌ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల విధానంపై పర్యవేక్షణ

సర్వేపల్లిలో క్రిబ్కో ఆధ్వర్యంలో రెండు విడతల్లో బయో ఇథనాల్‌ ప్లాంట్‌

ఏపీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీ 2022–27లో మరిన్ని చర్యలు

ప‌లు నిర్ణ‌యాల‌కు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్ర‌మోష‌న్ బోర్డు ఆమోదం

తాడేపల్లి: వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. ఆక్వా రంగం నుంచి ఎగుమతులు అధికంగా ఉన్నాయ‌ని, ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాల‌న్నారు. దేశంలో మెరైన్‌ ఎగుమతుల్లో 46శాతం రాష్ట్రం నుంచే జ‌రుగుతున్నాయ‌న్నారు. అందుకనే ఈ రంగాన్ని తగిన విధంగా ప్రోత్సహించాల‌ని ఆదేశించారు. సింగిల్‌డెస్క్‌ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల విధానంపై నిరంతర పర్యవేక్షణ ఉండాల‌ని సూచించారు. అత్యంత పారదర్శక విధానాల్లో భాగంగా ఈ మార్పులను తీసుకువచ్చామ‌ని చెప్పారు. విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుపై త‌గిన చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. 

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్ర‌మోష‌న్ బోర్డు (ఎస్ఐపీబీ) స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఎస్‌ఐపీబీ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 

నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్‌ భారతి కో–ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (క్రిబ్కో) ఆధ్వర్యంలో రెండు విడతల్లో బయో ఇథనాల్‌ ప్లాంట్‌.
- రూ.560 కోట్లతో 250 కె.ఎల్‌.డి. సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటు. 
- 100 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న క్రిబ్‌కో, 400 మందికి ఉద్యోగాలు.
- ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ.
- ఇదికాకుండా మరిన్ని విత్తన శుద్ధి సహా వివిధ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన కంపెనీ.

ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీ 2022–27లో మరిన్ని చర్యలు
- ఇప్పుడున్న ఎగుమతులను 5 ఏళ్లలో రెట్టింపు చేసే దిశగా అడుగులు
- ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్లు ఎగుమతులు సాధించాలని లక్ష్యం
- దీంట్లో భాగంగా పలు నిర్ణయాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ లాజిస్టిక్స్‌ పాలసీ 2022–2027లో భాగంగా మరిన్ని ప్రోత్సాహాకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం బూడి మత్యాలనాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు,  ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, గుమ్మనూరు జయరామ్, గుడివాడ అమర్నాథ్, ఆర్‌. కె. రోజా, సీఎస్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్ జి. సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌.ఎస్‌. రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

Back to Top