బందిపోటు రాజకీయమే బాబు పాలన మార్క్!

మీడియా స‌మావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు 

పెత్తందార్ల ముఠా నాయకుడు చంద్రబాబు 

14 ఏళ్ళ పాలనలో పేదల్ని కొట్టి పెత్తందార్లకు దోచిపెట్టిన చంద్రబాబు 

చంద్రబాబు స్కిల్ స్కామ్ కు వంతపాడిన పీవీ రమేష్ నీతులు చెప్పటమా?

బాబు వయసుకు, మాట్లాడే మాటలకు పొంతన ఉందా?

మంత్రి సీదిరి అప్పలరాజు

శ్రీ‌కాకుళం: బందిపోటు రాజకీయమే చంద్ర‌బాబు పాలన మార్క్! అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అభివ‌ర్ణించారు.  చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశాడు..? ఆయన పాలనలో పేదలకు మంచి చేసిన మార్క్‌ ఏంటి..? ఆ విషయం చెప్పుకోలేనోళ్లు ఇవాళ రాష్ట్రంలో బందిపోట్లు గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. పేదలకు అవసరమైన వైద్యాలయాలన్నీ నిర్వీర్యం చేయడం బందిపోట్ల పరిపాలన కాదా..? అదే, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. పేదవాడికి అందుబాటులో వైద్యనిలయాలున్నాయన్నారు.  పలాసలో తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు.

పెత్తందార్ల ముఠా నాయకుడు చంద్రబాబుః
అయ్యా చంద్రబాబూ.. నీ 14 ఏళ్ల అమోఘమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీతోపాటు నీ ముఠాలో ఉన్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఇలా అందరూ ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నారో.. రాష్ట్ర భవిష్యత్తును ఎంత నాశనం చేశారో ప్రజలంతా చూశారు. పెత్తందార్ల ముఠాకు చంద్రబాబు నాయకుడనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. 

చంద్రబాబు స్కిల్ స్కామ్ కు వంతపాడిన పీవీ రమేష్ః
చంద్రబాబు తొత్తుగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏదేదో మాట్లాడాడు. మరి, యువతకు ఉద్యోగాల పేరిట శిక్షణ ఇస్తామంటూ చంద్రబాబు ముఠా స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌కు పాల్పడ్డప్పుడు ఇదే వ్యక్తి ఫైనాన్స్‌ సెక్రటరీగా ఉన్నాడు. ఆ ప్రోగ్రాంకు సంబంధించి నోట్‌ఫైల్‌ తయారు చేశాడు. నోట్‌ఫైల్‌లో పీవీ రమేష్‌ అనే అధికారి చేతిరాతతో ఏం రాశాడో  కూడా అందరం చూశాం. ‘ఓరల్‌ ఇనస్ట్రక్షన్‌ ఆఫ్‌ హానరబుల్‌ సీఎం.. రిలీజ్‌ ద ఫండ్స్‌..’ అని రాసింది ఇదే పీవీ రమేష్‌. ఈ సంగతి ఆయన మరిచినా రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. రూల్స్‌ను అతిక్రమించి మరీ చంద్రబాబు ఫండ్స్‌ను రిలీజ్‌ చేయమన్నాడు. అప్పటికీ, కిందిస్థాయి అధికారులు ఇది సాధ్యం కాదనప్పటికీ, ముఖ్యమంత్రి వ్యక్తిగత ఆదేశాలంటూ చెప్పిందీ ఆయనే.. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ జరుగుతుందనే సమాచారం ఆయనకు తెలిసినప్పటికీ ఫండ్స్‌ రిలీజ్‌ చేశారు. పైగా, ఆ స్కామ్‌తో తనకేం సంబంధం లేదని ఎంటైర్‌ ఫైల్‌ రిఫరెన్స్‌ కోసం తనకు పంపాలని కూడా నోట్‌ఫైల్‌లో రాశాడు.

దళితుడిగా పుట్టి.. పేదవర్గాలకు అన్యాయం చేస్తావా..?
పీవీ రమేష్‌ను నేనొక ప్రశ్న అడుగుతున్నాను. ఏమయ్యా.. నువ్వూ ఒక దళితుడివే కదా...? దళితులకు ఏం అవసరమో నీకు తెలియదా..? నువ్వు ఆర్థికరంగ నిపుణుడువే కదా..? అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్‌ అదే కదా..? మరి, ఒక పేదవాడి సంక్షేమానికి ఆ బడ్జెట్‌లో చంద్రబాబు ఏం చేశాడు..? ఇవాళ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఏం చేస్తున్నారో నీకు తెలియదా..? 
         
మీరు ఫైనాన్స్‌ సెక్రటరీగా ఉన్నప్పుడే అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు ఖజానాలో ఉంది కేవలం రూ.100 కోట్లే.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరంటూ మాట్లాడాడు కదా..? ఇది వాస్తవమే కదా..? మరి, జగన్‌మోహన్‌రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇప్పటి వరకూ ప్రతీ నెలా ఒకటోతేదీకే మేం జీతాలెలా ఇచ్చాం..? దాదాపు డీబీటీ కింద ప్రభుత్వ సంక్షేమాన్ని పేద ప్రజలకు రూ.2.70 లక్షల కోట్లు ఎలా పంపిణీ చేశాం..? ఇన్నిన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్క్స్‌ ఎలా చేయగలిగాం..?
వీటిపై నీకు ఏనాడూ ఆలోచన కలగలేదా..? అదే నువ్వు ఫైనాన్స్‌ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇవ్వన్నీ చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు..? దీనికి నువ్వు స్పష్టమైన సమాధానం చెప్పాలి. 
దళితుడిగా పుట్టి దళితులకు అన్యాయం చేసే మాటల్ని దయచేసి నువ్వు మాట్లాడొద్దు.

దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడింది వైయ‌స్  జగన్‌మోహన్‌ రెడ్డి. అదే దళితుల్ని పదేపదే అవమానిస్తూ.. వారి సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని అతనికి వంతపాడుతున్నావంటే నిన్ను ఏ రకమైన మనిషిగా సంభోదించాలో నీకునువ్వు ఆలోచించుకో.. పెత్తందారీ ముఠా నాయకుడైన చంద్రబాబుకు నువ్వు వంత పాడుతున్నావంటే నువ్వెలాంటి వాడివో రాష్ట్రప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమౌతుంది.

బందిపోటు రాజకీయమే బాబు పాలన మార్క్ః
చంద్రబాబు ఈ రాష్ట్రప్రజలకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశాడు..? ఆయన పాలనలో పేదలకు మంచి చేసిన మార్క్‌ ఏంటి..? ఆ విషయం చెప్పుకోలేనోళ్లు ఇవాళ రాష్ట్రంలో బందిపోట్లు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పేదలకు అవసరమైన వైద్యాలయాలన్నీ నిర్వీర్యం చేయడం బందిపోట్ల పరిపాలన కాదా..? అదే, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. పేదవాడికి అందుబాటులో వైద్యనిలయాలున్నాయి. గ్రామస్థాయిలో విలేజ్‌ క్లినిక్‌లు, మండలస్థాయిలో ప్రైమరీ హెల్త్‌ క్లినిక్‌లు, నియోజకవర్గ కేంద్రాల్లో ఏరియా ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు, పాత ఆస్పత్రి భవనాలన్నింటినీ నాడు - నేడు కింద బాగుచేయడం అనేది బందిపోట్ల పాలన అంటారా..? పేదపిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను తీసుకుంటే నీ హయాంలో ఏ ఒక్క పాఠశాలనైనా బాగు చేయగలిగావా..? ఇవాళ నాడు-నేడు కింద స్కూళ్ల భవనాలను సుందరంగా తీర్చిదిద్దడాన్ని బందిపోట్ల పాలన అంటారా..? ఏ రంగం తీసుకున్నా.. 14 ఏళ్ల పరిపాలనలో నీ మార్కేంటి..? రాష్ట్రంలో ఫలానా ప్రాజెక్టు నీ బ్రెయిన్‌ చైల్డ్‌గా చెప్పుకునే దమ్ముందా..? నీ హయాంలో ఒక్క మెడికల్‌ కాలేజీ తీసుకురాగలిగావా.? ఏమీ చేయలేని నువ్వొక పెద్ద అభివృద్ధి దార్శనీకుడవని నీ తొత్తులు చేసే భజన మేం వినాల్నా..? ఏంటి నీ బందిపోటు రాజకీయం..? ఇకనైనా నీ బోడి మాటలు కట్టిపెట్టు. నీకులా మాకు మాట్లాడటం చేతగాదా..? మేమేమీ చదువుకోలేదా..? నీకన్నా ఎక్కువే చదివి రాజకీయాల్లో ఉన్నామని గుర్తించు. 

దివంగత వైయ‌స్‌ఆర్‌ బ్రెయిన్‌చైల్డ్‌ ఉత్తరాంధ్ర సృజలస్రవంతిః
ఉత్తరాంధ్ర సృజలస్రవంతి కోసం నువ్వు కల గన్నావా..? ఏం మాట్లాడుతున్నావు..? ఆ ప్రాజెక్టు ఎవరి బ్రెయిన్‌చైల్డ్‌..? దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు పోలవరం దగ్గర్నుంచీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీటిని తీసుకురావాలని ప్రాజెక్టును రూపకల్పన చేశారు. పోలవరం లెఫ్ట్‌కెనాల్‌ను విశాఖపట్టణం వరకు ఆయనే తవ్వించారు. ఉత్తరాంధ్ర సృజలస్రవంతికి శాంక్షన్‌ ఇచ్చి ఇక్కడ్నుంచి విజయనగరం వరకు నీటిని పంపాలని చూస్తే.. సరిగ్గా వారు దిగిపోయేనాటికి చంద్రబాబు 2018లో మరో జీవో ఇచ్చాడు. అంటే, దీన్నిబట్టి ఉత్తరాంధ్ర సృజలస్రవంతి గురించి ఎవరు కలగన్నట్టు..?

చంద్రబాబూ.. నీ హాయంలో ఉత్తరాంధ్ర సృజలస్రవంతి ప్రాజెక్టు కోసం ఒక్క ఎకరా భూమినైనా సేకరించావా..? కనీసం, నీ హయాంలో భూసేకరణ అథారిటీనైనా ఏర్పాటు చేశావా..? నువ్వు ఏమీ చేయకపోతే.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మేం భూమిని సేకరించాం. ఇప్పటికే భూసేకరణ పూర్తిచేసుకుని పనులు మొదలుపెట్టబోతున్నాం.

ప్రేమోత్సవం కబుర్లే గానీ.. టూరిజంకు నువ్వేం వెలగబెట్టావ్‌..?ః
విశాఖపట్టణంలో టూరిజం అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావా..? గతంలో నువ్వేం మాట్లాడావో మరిచావా..? విశాఖలో ప్రేమోత్సవం పెడతానన్నావు గుర్తుందా..? గతంలో గోవాలో జరిగిందంట.. దాన్ని తెచ్చి విశాఖలో పెడతానన్నది నువ్వేకదా..? మరి, పెట్టావా..? ఇదంతా నా సొంత కవిత్వం కాదు. మీ ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసిందే మాట్లాడుతున్నాను. ప్రేమోత్సవంలో ప్రతీ జంటకూ ఒక ఇండివిడ్యువల్‌ టెంట్‌ ఏర్పాటు, మూడు రోజులపాటు బికినీలతో షోలని చెప్పావే..? ఇవ్వన్నీ మేం మరిచిపోయామా..? నీ ప్రేమోత్సవాలు.. కామోత్సవాలన్నీ ప్రజలకింకా గుర్తున్నాయి. ఇవాళ ఇక్కడకొచ్చి వైజాగ్‌ నుంచి భావనపాడు వరకూ బీచ్‌రోడ్‌ వేస్తానంటే.. నీ 14 ఏళ్లు అధికారంలో ఏం గాడిదలు కాశావు..? అప్పట్లో చేయని టూరిజం అభివృద్ధి... రేపు చేస్తానంటే నీ మాటలు నమ్మేది ఎవరయ్యా ..? నీ కల్లబొల్లి కబుర్లు కట్టిపెడితే మంచిది. 

4 పోర్టులు, హార్బర్లతో తీరప్రాంత అభివృద్ధిప్రదాత వైయ‌స్‌ జగన్‌ 
రాష్ట్రంలో సుమారు 975 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంటే నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో నువ్వు చేసిందేంటి.? ఎక్కడైనా ఒక ఇటుక పెడ్డ గానీ ఒక సిమెంట్‌ బస్తాగానీ వేశావా..? ఎన్ని హార్బర్లు, పోర్టులు మంజూరు చేశావు..? అదే జగన్‌మోహన్‌రెడ్డి గారి హయాంలో ఇవాళ 4 పోర్టులు నిర్మాణమవుతున్నాయి. మూలపేట, కాకినాడ ఎస్‌ఈజెడ్‌ పోర్టు, మచిలీపట్నం, రామాయపట్టణం పోర్టులు శరవేగంగా పనులు జరుగుతోన్నాయి. మరి, నీ హయాంలో ఇవ్వనీ చేయడం నీకు చేతకాలేదా..? నీ ఊహకందని అభివృద్ధి ఇది. ప్రతీ జిల్లాలో హార్బర్లు మంజూరు చేశారు. ఇప్పటికే 4 హార్బర్లు కూడా పూర్తయ్యాయి. అలాంటిది, నువ్వు ఇప్పుడొచ్చి కోస్టల్‌లైన్‌లో రోడ్లు వేసేదేముంది..? అభివృద్ధి చేసేదేముంది..? నీ చేతగానితనం చూసింతర్వాతే ప్రజలు నిన్ను నీ పార్టీని మూలనకూర్చోబెట్టారు. 

పారిశ్రామికాభివృద్ధిపై నీ ఉత్తకబుర్లు ప్రజలకు తెలుసుః
ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి గురించి మాట్లాడుతున్నావే..? నువ్వు తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెబుతావా చంద్రబాబూ..? భోగాపురం ఏయిర్‌పోర్టు, మూలపేట పోర్టు, బుడగట్లపాడు హార్బర్‌లను కట్టడంతో పాటు నువ్వులపేట ఎఫ్‌ఎల్సీని హార్బర్‌గా మార్చబోతున్నాం. చింతపల్లి జెట్టీని మేం కడుతున్నాం. భీమిలి దగ్గర అదనంగా మరో జెట్టీ ఇచ్చాం. పోర్టుకోసం 4,600 ఎకరాల ల్యాండ్‌బ్యాంకును సిద్ధం చేసి ఉంచాం. మరి, నీ హయాంలో నువ్వు చేసిందేంటి..? చెప్పుకోవడానికి నువ్వు చేసిందేమీలేదు. అది చేస్తా.. ఇది చేస్తాననే నీ ఉత్తకబుర్లును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. 

బాబు వయసుకు మాటలకు పొంతన ఉందా?
రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశానని ఊదరగొట్టుకునే నీకు ఎదుటి మనిషిని గౌరవించడం తెలియదా..? నువ్వు మా నోట్లో సీసం పోస్తానంటావా..? దొబ్బెస్తారంటావా..? బొక్కేశారంటావా.?? బూతులు నీకేనా.. మాకు రావా..? నీ భాషకు నీ వయస్సుకేమైనా సంబంధం ఉందా..? నీ నోటికేదొస్తే అది మాట్లాడటం కాదు చంద్రబాబూ.. ? మేమూ అధికారంలో ఉన్నాం. నువ్వు నోట్లో సీసం పోస్తే.. మేం నీ నవరంధ్రాల్లోనూ అదే సీసం పోయగలం. ఇందులో మాకేం మొహమాటం లేదు. ఇప్పటికైనా నీ వయస్సును నువ్వు గుర్తు తెచ్చుకుని ఎందుకంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావో.. సమాధానం చెప్పు. 

రుషికొండపై నీ పిచ్చివాగుడు కట్టిపెడితే మంచిది ః
రుషికొండ జపం చేసే బాబూ.. నిన్నొక ప్రశ్న అడుగుతున్నాను. గతంలో రుషికొండపై రిసార్టు కొండమీద కట్టలేదా..? కొండను తొలిచి హరిత బీచ్‌ రిసార్టు కట్టలేదా.. జవాబివ్వు..? దాన్ని ఇప్పుడు కొంచెం ఎక్స్‌టెన్షన్‌ చేశారు. గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్యక్రమం అక్కడ జరుగుతోంది. మరి, రామోజీరావు రామోజీఫిల్మ్‌సిటీని ఎక్కడ కట్టాడు..? కట్టింది కొండమీద కాదా..? రామానాయుడు స్టూడియోను కూడా కొండతొలిచి కట్టిందే కదా..? మధురవాడ ఐటీ ఎస్‌ఈజెడ్‌ కొండలమీదనే కదా కట్టింది..? అంటే, మీరు కట్టినప్పుడు అవన్నీ ప్రకృతికి అనుకూలం..? మేం కడితే మాత్రం ప్రకృతికి ప్రతికూలమా..? రుషికొండపై మేం ఇవాళ కట్టేది ప్రైవేటు భవనాలేమీ కాదు. అవన్నీ ప్రభుత్వ భవనాలే గనుక నీ పిచ్చివాగుడు కట్టిపెడితే మంచిది. 

ఉద్దానం ఆస్పత్రిపై నీ బడాయి మాటలు చాలించుః 
ఉద్దానంలో కిడ్నీ బాధితులకు ఆస్పత్రి నువ్వు కట్టించావా..? నువ్వు ఆ రోజు ఇచ్చిన శాంక్షన్‌ ఆర్డర్‌ ఏంటి..? ప్రైవేట్‌ ఎంబీబీఎస్, బీడీఎస్‌ కళాశాలల సంఘం ఆధ్వర్యంలో వాళ్లు ఒక ఆస్పత్రి పెట్టుకుంటానంటే నువ్వు భూమివ్వాలని ఆర్డర్‌ ఇచ్చావు గానీ.. కిడ్నీ డయాలసిస్‌ సెంటర్‌ కోసం కాదే..? పైగా, నువ్వు వచ్చి ఇక్కడ 200 పడకల ఆస్పత్రి ఇచ్చానని చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా..? నువ్వు మనిషివా..? మృగానివా..? 

సూదికొండ దోపిడీ చేస్తానంటే ఊరుకునేదిలేదుః
సూదికొండ గురించి నువ్వు నా మీద అభాండాలేయడం కాదు. ఎవడైతే సూదికొండను దోచేద్దామని పనిచేస్తున్నాడో వాడి మెడలోనే నువ్వు కండువా వేశావని తెలుసుకో.. నేనిప్పుడు ఒక విషయం చెబుతున్నా.. నా ప్రాణం ఉండగా సూదికొండపై ఎవడినీ చేయి వేయనివ్వనని హెచ్చరిస్తున్నా గుర్తుపెట్టుకోండి..  

6.72 లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత జగన్‌గారిదిః 
ఇంటికో ఉద్యోగం ఇస్తానని నాడు యువనేస్తం పేరిట చంద్రబాబు యువమోసం చేసింది చాలక.. మళ్లీ ఇప్పుడొచ్చి అదేమాట మాట్లాడుతున్నాడు. అది నోరా.. తాడిమట్టా..? ఆయన హయాంలో 70 లక్షల టీచర్ల ఉద్యోగాలిచ్చానంటాడు. అసలు, అంతమంది విద్యార్థులే లేరుకదా..? మరి, టీచర్ల పోస్టులు అన్నెలా ఇచ్చావు..? అదే జగన్‌మోహన్‌రెడ్డి గారు అధికారంలోకొచ్చాక కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కలిపి 6.72 లక్షల ఉద్యోగాలిచ్చారు. 

ఉత్తరాంధ్రలో ఎగిరేది వైయ‌స్‌ఆర్‌సీపీ జెండానేః
చంద్రబాబు బందిపోటు రాజకీయాలను అర్ధం చేసుకోలేని పరిస్థితిలో ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు లేరు. ఒకప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని అక్రమ కేసులు పెట్టారో.. గిరిజన కుటుంబాలు ఇళ్లూవాకిళ్లు, ఊళ్లు వదిలిపెట్టి అడవుల బాట పట్టారో అందరికీ తెలుసు. కానీ, జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అలాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వ సంక్షేమం నేరుగా పేదల ఖాతాలకు చేరుతుంటే ఆనందంగా జీవనం గడుపుతున్నారు. ఎవరి హయాంలో పరిపాలన ఎంత సంతోషంగా ఉందో ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు గనుక రేపటి ఎన్నికల్లోనూ ఎగిరేది వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనేనని ధీమాగా చెబుతున్నాం అని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. 

Back to Top