బాపట్ల జిల్లా: మేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలానికి చెందిన వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు బాణాల తనిష్ పట్ల పోలీసుల వ్యవహారంపై పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలకు నిజాలు తెలియజేస్తున్న తనిష్ను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అర్ధరాత్రి 3 గంటల సమయంలో అక్రమంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని ఖండించారు. సోమవారం వేమూరు నియోజకవర్గం ఇంచార్జి వరుకుటి అశోక్ బాబు, సోషల్ మీడియా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తనిష్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై వేమూరు నియోజకవర్గం ఇంచార్జి వరుకుటి అశోక్ బాబు మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం చట్టం ప్రకారం కాకుండా, కూటమి నాయకుల ఆదేశాల మేరకు నడుచుకోవడం అత్యంత శోచనీయమని విమర్శించారు. ఇటువంటి చర్యలు రాజకీయ వేధింపులకే నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ తరఫున తనిష్కు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కానీ ఇలాంటి చర్యల ద్వారా భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని వైయస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ఇలాంటి అరాచకాలను ప్రజలు తిప్పికొడతారని వారు హెచ్చరించారు.