సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన సిరివెన్నెల కుటుంబ స‌భ్యులు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. క్లిష్ట ప‌రిస్థితుల్లో త‌మ కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దివంగత మ‌హానేత‌ వైయ‌స్‌ రాజశేఖర రెడ్డితో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి ఉన్న‌ అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రితో పంచుకున్నారు. సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేయడంపై సీఎం వైయ‌స్ జగన్‌కు సిరివెన్నెల కుటుంబ స‌భ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ భరోసానిచ్చారు. సీఎంని కలిసిన వారిలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె శ్రీలలితా దేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్‌.శాస్త్రి ఉన్నారు. 

Back to Top