పచ్చ మీడియా..పత్రికలను బహిష్కరించాలి

మంత్రి ఆర్కే రోజా

విజయవాడ: ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్న పచ్చపత్రికలపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అంటే మీకు (పచ్చ పత్రికలు) గౌరవం లేదా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అందరూ అభినందిస్తుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని అన్నారు. పచ్చ మీడియాను..పత్రికలను బహిష్కరించాలన్నారు. శ‌నివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూపించేందుకు ఎల్లో మీడియాకు మనసు రాలేదా? అని మండిపడ్డారు. అంబేద్కర్‌కు నిజమైన వారసుడు సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. శుక్రవారం రోజున ఒక్క నిమిషం కూడా అంబేద్కర్‌ను చూపించలేకపోయారని మంత్రి రోజా తెలిపారు. అంబేద్కర్‌ను పచ్చమీడియా అవమానించిందని..అంబేద్కర్‌కు అండగా నిలబడిన వర్గాలను కూడా అవమానించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వంద అడుగుల విగ్రహం పెడతానని చెప్పిన చంద్రబాబు.. ఒక్క విగ్రహమైనా పెట్టాడా? అని ప్రశ్నించారు. ప్రచారాలు, సమస్యల డైవర్షన్‌కు చంద్రబాబు అంబేద్కర్‌ను వాడుకున్నారని అన్నారు. తోపు.. తురుము అని చెప్పుకునే చంద్రబాబు విజయవాడ నడిబొడ్డులో ఏరోజైనా ఇలాంటి కార్యక్రమం చేయగలిగారా? అని నిలదీశారు.

అంబేద్కర్ స్మృతివనం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవని, మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. తమ సామాజిక వర్గమైన చంద్రబాబును కాపాడుకోవడం కోవడమే ఎల్లోమీడియా పని అని విమర్శించారు. టీడీపీ, జనసేన తోక పార్టీలకు  ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి ఆర్కే రోజా అన్నారు.

కళాకారుల‌కు గుర్తింపు కార్డుల ప్ర‌దానం..
 విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా అందజేశారు. అనంతరం కళాకారులతో కలిసి మంత్రి రోజా డప్పు వాయించారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని.. గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి రోజా వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు న్యాయం జరగలేదన్నారు. కళాకారులు గుర్తింపు కోసం తాపత్రయ పడతారని.. కళాకారులకు అండగా నిలబడాలని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి భావించారని మంత్రి తెలిపారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని.. సాంస్కృతిక సంబరాల ద్వారా కళాకారులను గుర్తించామన్నారు. ధైర్యంగా మేం కార్డుల ప్రదానోత్సవం చేయగలుగుతున్నామన్నారు.

 

సాంస్కృతిక సంబరాల్లో గుర్తించిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. మారుమూల కళాకారులను సైతం గుర్తించి వారికి గుర్తింపు కార్డులు అందజేస్తున్నామన్నారు. గతంలో కళాకారులను ఎవరూ పట్టించుకోలేదని.. జగనన్న మాత్రమే కళాకారులను పట్టించుకున్నారన్నారు. కళాకారులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఎన్నికల సమయంలో దొంగలంతా ఒకటవుతున్నారని.. పందుల్లా గుంపులుగా వస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. దొంగలకు, ఆ పందులకు బుద్ధి చెప్పాలంటే కళాకారుల ఆట…మాట..పాట కావాలన్నారు. ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024) …జగనన్న వన్స్ మోర్ అంటూ మంత్రి రోజా నినాదం చేశారు.

చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి పోయాడని.. జనాన్ని దోచుకుని హైదరాబాద్‌లో ఆస్తులు దాచుకున్నాడని మంత్రి రోజా విమర్శించారు. మళ్లీ ఆ దొంగలొస్తే ప్రజలకు విద్య,వైద్యం,కళాకారులకు అన్నం దొరకదన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి విషం చిమ్మి పోతున్నారని.. నాన్ లోకల్ పొలిటీషయన్ల గురించి పట్టించుకోవద్దని మంత్రి రోజా అన్నారు.

Back to Top