నగరి: ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు గుప్పించి, ఆ తర్వాత ఏదీ అమలు చేయని సీఎం చంద్రబాబు.. బాబు షూరిటీ చీటింగ్ గ్యారెంటీగా మారారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కె రోజా ఆక్షేపించారు. సూపర్సిక్స్ అమలు చేయకపోతే, కాలర్ పట్టుకోవాలన్న నారా లోకేష్, ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె.. ఫీజులు, స్కాలర్షిప్ కింద ప్రభుత్వం రూ.3900 కోట్లు బకాయి పడిందని చెప్పారు. ఈనెల 5లోగా ఆ మొత్తం చెల్లించకపోతే, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని నగరిలో మీడియాతో మాట్లాడిన రోజా వెల్లడించారు. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు. చంద్రబాబు అసమర్థత: ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అంటూ దుష్ప్రచారం చేసిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే సూపర్సిక్స్ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ రాష్ట్ర వాస్తవ అప్పులు రూ.4.6 లక్షల కోట్లు అని ప్రభుత్వమే తేల్చింది. మరి అలాంటప్పుడు సూపర్సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు? ఇది కచ్చితంగా సీఎం చంద్రబాబు అసమర్థతే. లోకేష్ కాలర్ పట్టుకుంటే తప్ప పథకాలు అమలు కావా?. ఇంత జరుగుతున్నా పవన్కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? అన్నింటికీ తన బాధ్యత అని చెప్పిన ఆయన, ఇప్పుడు తప్పించుకుంటే ఎలా?. ఫిబ్రవరి 5. డెడ్లైన్: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజులు, స్కాలర్షిప్ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. పెండింగ్లో పెట్టిన రూ.3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలి. అందుకు ఫిబ్రవరి 5 డెడ్లైన్. ఆలోగా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు, స్కాలర్షిప్ చెల్లించకపోతే, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. విద్యార్థులకు అండగా నిల్చి పోరాడుతాం. విద్యార్థుల ఫీజు (విద్యాదీవెన) కింద రూ.2800 కోట్లు, స్కాలర్షిప్ (వసతిదీవెన) కింద మరో రూ.1100 కోట్లు.. రెండూ కలిపి మొత్తం రూ.3900 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. అన్ని వర్గాలకు వంచన: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయకుండా, అన్ని వర్గాలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. అందరినీ వంచనకు గురి చేసింది. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు, సీఎం అయిన 8 నెలల్లో ఏ పథకం అమలు చేయలేదు. అతి ముఖ్యమైన విద్య, వైద్య వ్యవస్థలు కుదేలయ్యాయి. రైతులు, ఆడబిడ్డలు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలను వంచించిన ఘనత చంద్రబాబుది. ఆదాయం పెరిగితేనే సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? హామీల అమలుకు బాధ్యత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఎక్కడున్నారు. లోకేష్ కాలర్ పట్టుకుంటే తప్ప పథకాలు అమలు కావా? చేతకాకపోతే దిగిపొండి: బటన్ నొక్కడం పెద్ద విషయమా.. మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని అవహేళనగా మాట్లాడిన చంద్రబాబు, అంత తేలికైన విషయమైతే ఇప్పుడెందుకు నొక్కలేకపోతున్నారు? హామీలు అమలు చేయడం చేతకాకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి వెంటనే పదవులకు రాజీనామా చేసి దిగిపోవాలి. ఇకనైనా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం (అమ్మ ఒడి), నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ పథకాలు.. ఎప్పుడు, ఎవరు అమలు చేస్తారో.. చంద్రబాబు, పవన్కళ్యాణ్ చెప్పాలి. హామీల అమలుపై చంద్రబాబుని ప్రశ్నించడానికి పవన్కళ్యాణ్కు ఏం అడ్డం వచ్చింది? అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి, ఇప్పుడు నిస్సిగ్గుగా చేతులెత్తేసిన చంద్రబాబు, అర్ధం లేని ఆరోపణలు, విమర్శలతో నిత్యం జగన్గారిని నిందిస్తున్నారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ ఎనిమిది నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకపోయినా, ఏకంగా రూ.1.19 లక్షల కోట్ల అప్పు చేసింది. మరి ఆ డబ్బంతా ఏమైంది? దేని కోసం ఖర్చు చేశారు? అందుకే అప్పులపై కూటమి ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వానికి ఎలా సంక్షేమం అందించాలో చేతకాకపోతే, కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేసి చూపించిన జగన్ పాలనను చూసి నేర్చుకోవాలి. చూస్తున్నా.. స్పందించరా పవన్?: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేక వైయస్ఆర్సీపీ సానుభూతి మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టి వేధిస్తున్న జనసేన, టీడీపీ కార్యకర్తల ఆగడాలపై పవన్కళ్యాణ్ చర్యలు తీసుకోరా? మీ కూటమి పార్టీలో ఉన్నవారే మహిళలా? ఇతర మహిళల రక్షణ ప్రభుత్వ బాధ్యత కాదా? మహిళల జోలికొస్తే తాట తీస్తామన్న మీ అట్టహాస డైలాగ్లు కేవలం మైక్లకే పరిమితమా? అందుకే ఇకనైనా వైఖరి మార్చుకోవాలని, వైయస్ఆర్సీపీ మహిళల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆర్కె రోజా హెచ్చరించారు. అలాగే వేధిస్తే ఆగిపోతారని మాత్రం అనుకోవద్దని ఆమె చురకలంటించారు.