నంద్యాల: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ జగన్ పిలుపు మేరకు వైయస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీతో హోరెత్తింది. విద్యార్థులు,యువత, వైయస్ఆర్ సీపీ నాయకులు, మహిళలు రోడ్డెక్కారు. ఆత్మకూరు టౌన్ లోని నంద్యాల టర్నింగ్ నుంచి తహసిల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి,ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య భారతదేశంలో కనీవినీ ఎరుగని విధంగా 17 మెడికల్ కాలేజీలను సాధించి జాతికి అంకితం చేసిన నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తూ వాటిని తమ బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఖండించారు. గతంలో ప్రభుత్వ రంగ సంస్థలను తన కోటరీకి ధారాదత్తం చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్ర యువతకు ఆశాదీపమైన మెడికల్ కాలేజీలను తన స్వప్రయోజనాలకోసం తన మిత్రులకు,బినామీలకు ధారాదత్తం చేయాలని చూస్తున్నాడని నిప్పులు చెరిగారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం నిర్ణయానికి స్వస్తి పలికి ప్రభుత్వం నిర్మించకుంటే వైఎస్ఆర్ సీపీ నేతృత్వంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పిపి. మధుసూదన్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు ,విద్యార్థులు, యువకులు,మహిళలు ,వైయస్ఆర్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.