తాడేపల్లి: వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా పార్టీ చేస్తున్న ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని బాపట్ల జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో నిరసన చేపడితే తనతో పాటు 77 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు. పేదవారికి ఉచితంగా అందాల్సిన వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మార్చొద్దని నినదిస్తూ చంద్రబాబుకి కనువిప్పు కలిగేలా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తేనే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోయిందని చెప్పారు. నిరసన తెలిపే హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. తమపై ఎందుకు కేసులు పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. కేసులు పెట్టినంత మాత్రాన వైయస్ఆర్సీపీ శ్రేణులు భయపడిపోతాయనుకోవడం చంద్రబాబు అవివేకమని, పేదల పక్షాన వైయస్ఆర్సీపీపోరాటం ఆపే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం కాకుండా చేసే ఉద్యమంలో వెనకడుగు వేయడం జరగదని గట్టిగా బదులిచ్చారు. ● ఆయన ఇంకా ఏమన్నారంటే... రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైయస్ఆర్సీపీ నిర్వహించిన ప్రజా ఉద్యమం నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. విద్యార్థులు, మేథావులు, ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొని వైయస్ఆర్సీపీ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో నాటి సీఎం వైయస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 7 కాలేజీలు పూర్తి చేశారు. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేసే కుట్రలను వ్యతిరేకిస్తూ గత నెల రోజులుగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. చంద్రబాబుకి కనువిప్పు కలగాలని వైయస్ఆర్సీపీ చేస్తున్న ప్రజా ఉద్యమం చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఎలాగైనా ప్రజా గొంతులను నొక్కాలనే కుట్రతో, కూటమి ప్రభుత్వం ఊరూరా నాయకులను ఏరుకొచ్చి మరీ అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టడం ద్వారా ప్రజా సంపదను దోచుకోవాలని చూస్తున్న కూటమి ప్రభుత్వ కుట్రలను ప్రజలు చూస్తూనే ఉన్నారు.