గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు బుధవారం(నవంబర్ 12) భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గుంటూరులో తలపెట్టిన నిరసన ర్యాలీలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాలీని పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. దీంతో పట్టాభిపురం సిఐకి, అంబటి రాంబాబుకి మధ్య వాగ్వాదం జరిగింది. అంబటి రాంబాబుపై పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు దౌర్జన్యం చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. స్వామి థియేటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలను కంకరగుంట ఫ్లైఓవర్ మీదకు రానీయకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. దీంతో బారికేడ్లను నెట్టుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ, అంబటికి వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. పోలీసుల అవరోధాలను అధిగమించిన నాయకులు, కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లారు. మంత్రి లోకేష్ ప్రోద్భలంతో సీఐ తనను టార్గెట్ చేశారని రాంబాబు మండిపడ్డారు. మేరుగు నాగార్జునపై కేసు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ పిలుపు మేరకు బుధవారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్నారంటూ మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో పాటు మరో 76 మందిపై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్నివెనక్కి తీసుకునేవరకు పోరాటం కొనసాగిస్తామని మేరుగు నాగార్జున హెచ్చరించారు.