తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతోంది. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామాలు, వార్డుల్లో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాలకు తరలించగా, వైయస్ఆర్సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందిస్తున్నారు. అధినేత పిలుపు..కదం తొక్కుతున్న కార్యకర్తలు వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూపొందించిన ఉద్యమాలకు ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే చలో మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని నిర్వహించగా, దీనికి కొనసాగింపుగా నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. గ్రామగ్రామాన, పట్టణాల్లోని డివిజన్లలోను కొద్ది రోజులుగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నారు, దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సంతకాల సేకరణలో వివిధ గ్రామాల నేతలు ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. అందుకే ఒక్కో నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల సంతకాల సేకరించాలనేది పెద్ద లక్ష్యంగా అనుకోవడం లేదు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పార్టీలో అన్ని స్థాయిల నేతలతో పాటు అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ రెట్టించిన ఉత్సాహంతో సంతకాల సేకరణ ముమ్మరంగా చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో అయితే డివిజన్లను క్లస్టర్లుగా విభజించి, పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించి మరీ సంతకాల సేకరణ చేపడుతున్నారు.